Mukarram Jah: అప్పట్లోనే అపర కుబేరుడు- సగం హైదరాబాద్..!!
హైదరాబాద్: హైదరాబాద్ స్టేట్ 8వ నిజాం నవాబు ముకర్రం ఝా బహదూర్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖరం ఝా చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. నిజాం వారసుడిగా విద్య, వైద్యా రంగాల్లో ఎనలేని సేవలను అందించారని పేర్కొన్నారు. పేదల కోసం ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఆయన భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని ఆదేశించారు.
ముకరం ఝా శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోనే తన భౌతిక కాయానికి అంత్యక్రియలను నిర్వహించాలనేది ఆయన ఆఖరి కోరిక. ఈ మేరకు ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ కు తీసుకుని రానున్నారు కుటుంబ సభ్యులు. ఈ నెల 17న టర్కీ నుంచి ఆయన భౌతికకాయం హైదరాబాద్ కు చేరుకోనుంది.
అనంతరం ప్రజల సందర్శనార్థం చౌమొహల్లా ప్యాలెస్లో ఉంచనున్నారు. అసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను చేపట్టనుంది. హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించిన చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు, ఆజం ఝాకు జన్మించారు. 1954 జూన్ 14వ తేదీన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయనను వారసుడిగా ప్రకటించారు.
ముకర్రం ఝా 1971 వరకు అధికారికంగా ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ గా గుర్తింపు పొందారు. ఆ తరువాత అప్పటి కేంద్ర ప్రభుత్వం రాచరిక వ్యవస్థను రద్దు చేసింది. తన తండ్రిలాగే ముకర్రం ఝా కూడా 1980వ దశకం వరకు కూడా భారత్ లోనే అత్యంత ధనవంతుడు. ఎనలేని ఆస్తులు ఆయన సొంతం.
హైదరాబాద్ స్టేట్ భారత్ లో విలీనం తరువాత ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1950 జనవరి 26వ తేదీ నుంచి 1956 అక్టోబర్ 31వ తేదీ వరకు రాష్ట్ర ప్రముఖ్ గా పనిచేశారు. ముకరం ఝాకు అయిదుమంది భార్యలు. మొదటి భార్య టర్కిష్ కు చెందిన ఎస్రా బిర్గిన్. ఆ దంపతులకు ప్రిన్స్ అజ్మత్ ఝా, సాహిబ్ జాది షెహర్యార్ బేగం ఉన్నారు.
హైదరాబాద్ లో ఫలక్నుమా ప్యాలెస్, ఖిల్వత్ ప్యాలెస్, కింగ్ కోఠి, చిరాన్ ప్యాలెస్.. ఇవన్నీ ముకర్రం ఝాకు చెందిన ఆస్తులే. అవన్నీ ఇప్పుడు ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలుగా మారిన విషయం తెలిసిందే. ఎసరా బిగిన్ చౌమహల్లా ప్యాలెస్ మరియు ఫలక్నుమా ప్యాలెస్ పునరుద్ధరణతో ఘనత పొందారు. హైదరాబాద్ ఎనిమిదవ నిజాం ముకర్రం జా బహదూర్ జనవరి 15 ఆదివారం నాడు ఇస్తాంబుల్లో మరణించారు.