మునుగోడులో కాంగ్రెస్ మరో ప్లాన్; నేటినుండి 90రోజుల వ్యూహం.. ఈసారైనా వర్కవుట్ అయ్యేనా?
మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంటే, ఇక కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ సెప్టెంబరు 1నుంచి మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.

మునుగోడుపై కాంగ్రెస్ మరో స్కెచ్ .. 90 రోజుల ప్లాన్
తెలంగాణలో రాజకీయంగా పట్టు సాధించటం కోసం గట్టి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి పాలైతే, ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ క్రమంలో అటువంటి పరిస్థితి చోటు చేసుకోకుండా మునుగోడు నియోజకవర్గం పై పట్టు సాధించడం కోసం కాంగ్రెస్ మరో స్కెచ్ వేసింది. టిఆర్ఎస్, బిజెపి కంటే దీటుగా జనాల్లోకి వెళ్లడానికి ప్లాన్ చేసిన కాంగ్రెస్ పార్టీ 90 రోజుల కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 90 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఎవరికి ఓటు వేయాలి అన్నది ఆలోచించుకోవాలని పెద్ద ఎత్తున కరపత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది.

బీజేపీ, టీఆర్ఎస్ ల పై కరపత్రాలతో ప్రచారం
టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను, వాటిని అమలు చేయకుండా పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయించింది. రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి వంటి అనేక అంశాలపై ప్రజలు ఆలోచించేలా క్షేత్ర స్థాయిలోకి కరపత్రాలను తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలియజెప్పి బిజెపికి చెక్ పెట్టాలని వ్యూహం రచించింది.

ప్లాన్ లు చేస్తున్నా అమలులో విఫలం అవుతున్న కాంగ్రెస్
అలాగే రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్న టీఆర్ఎస్ వైఖరి పైన ప్రజలకు తెలియజెప్పి ప్రజా మద్దతు కూడగట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి రంగంలోకి దిగనుంది. ఇప్పటివరకు మునుగోడు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్ని వ్యూహాలు రచించినా, వాటిని అమలు చేయడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు విఫలమవుతూనే వచ్చారు. మరి ఇప్పుడు తాజాగా 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన కాంగ్రెస్ పార్టీ, మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ కార్యాచరణ అయినా సక్రమంగా అమలు చేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మన మునుగోడు మన కాంగ్రెస్ అంటూ క్షేత్ర స్థాయిలోకి వెళ్ళలేకపోయిన కాంగ్రెస్
ఇప్పటికే మన మునుగోడు మన కాంగ్రెస్ అంటూ ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలోకి వెళ్ళలేకపోయింది. ఇప్పటికే మునుగోడులో 175 గ్రామాలకు కాంగ్రెస్ సమన్వయకర్తలను నియమించింది. కాంగ్రెస్ పార్టీ తన సేనను మొత్తంగా మునుగోడులో ఉపఎన్నికలో విజయం కోసం రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకుంది. "ప్రజాస్వామ్యానికి వందనం" అనే ప్రచారాన్ని చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ ప్రతి కాంగ్రెస్ నాయకుడు కనీసం 100 మంది ఓటర్ల కాళ్ళు మొక్కాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రయత్నం పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ 90 రోజుల ప్లాన్ అంటూ కాంగ్రెస్ ప్రకటించింది.

మునుగోడులో కాంగ్రెస్ కష్టాలు ... మునిగిపోతుందా?
ఏది ఏమైనా ఒకపక్క పార్టీనుంచి చోటుచేసుకుంటున్న వలసలతో, సొంత పార్టీ నేతల మధ్య చోటుచేసుకున్న అంతర్గత విభేదాలతో, ఇంతవరకు మునుగోడు అభ్యర్థి ఎవరన్నది ఫైనల్ కాక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ మునుగోడులో పట్టు సాధిస్తుందా? లేక మునిగిపోతుందా అన్నది మరికొంత కాలంలోనే తెలియనుంది.












Click it and Unblock the Notifications