మూసీ వరదలు.. వారికి పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఈ భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
మూసీ వరదలు.. మునిగిన ఎంజీబీఎస్ బస్టాండ్
హైదరాబాద్ నగరానికి ప్రధాన జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లు పూర్తిగా నీటితో నిండిపోవడంతో జలాశయాల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. దీంతో మూసి నదిలో వరద ఉధృతి పెరిగింది. మూసి ఉగ్రరూపం దాల్చింది. మూసి వరద ప్రభావంతో ప్రధాన రవాణా కేంద్రమైన ఎంజీబీఎస్ బస్టాండ్ మునిగిపోయింది. నగరానికి కీలకమైన రవాణా మార్గాల పైన మూసి వరదల ప్రభావం తీవ్రంగా పడింది.

భయాందోళనలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పిలుపు
ప్రస్తుతం మూసీ నది పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలు ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇంకా వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్న క్రమంలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఇక మూసీనది వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలక్షేమం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు.
వరద బాధితులకు అండగా ఉండాలన్న పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాలలో తీవ్రమైన ప్రభావం పడిందని పేర్కొన్నారు. మూసి వరదల కారణంగా ఎంజీబీఎస్ పరిసరాలు నీట మునిగాయని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవాలని, వారికి తమ వంతుగా సహాయం చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులకు, తెలంగాణ రాష్ట్రంలోని జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
జన సైనికులు కూడా సహాయక చర్యల్లో ఉండాలని పవన్ సూచన
వివిధ సేవా కార్యక్రమాలతో వరద బాధితులకు మనోధైర్యం కల్పించాలని, కష్టకాలంలో వారికి బాసటగా నిలవాలని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిందని, జన సైనికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ తన ప్రకటన ద్వారా సూచన చేశారు.
ఎవరికి కష్టం వచ్చినా స్పందించే గుణం పవన్ కళ్యాణ్ ది
తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే భరోసా కల్పించడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన మూసి వరదల పైన స్పందిస్తూ, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు, నేతలకు, అభిమానులకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications