మనకూ ఓ గేట్ వే ఆఫ్ హైదరాబాద్..: ఎలివేటెడ్ కారిడార్
ప్రతి సంవత్సరం సంభవిస్తోన్న భారీ వరదలు హైదరాబాద్ ను అతలాకుతలం చేస్తూ వస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. మున్ముందు వరద తాకిడి లేకుండా చేసేలా చర్యలు తీసుకుంటోంది. వచ్చిన వరద నీరు వచ్చినట్టే తరలి వెళ్లేలా ఓ భారీ ప్రణాళికను రూపొందించనుంది.
హైదరాబాద్ వరదల నుంచి గట్టెక్కడానికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఒక్కటే పరిష్కారమని భావిస్తోన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో- ఈ ప్రాజెక్ట్ పనులను మరింత వేగవంతం చేయాలని సంకల్పించారు. ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై కసరత్తు మొదలు పెట్టారు.

మూసీ నది తీరాన్ని గేట్ వే ఆఫ్ హైదరాబాద్ గా అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ దిశగా ప్రణాళికలను రూపొందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అలాగే- గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన ప్రఖ్యాత టవర్ను నిర్మించాలని ప్రతిపాదించారు.
ఈ రెండు భారీ ప్రాజెక్టుల్లో భాగంగా.. ఔటర్ రింగ్ రోడ్ (ORR)కు ఒక వైపున ఎకో థీమ్ పార్కును నిర్మించాలని నిర్ణయించారు. బ్రహ్మకుమారీస్ గ్లోబల్ పీస్ సెంటర్ సమీపంలోని బాపూఘాట్ వైపున ఈ భారీ టవర్ నిర్మించి, రెండు ప్రాంతాలను ఎలివేటెడ్ గేట్వే నిర్మాణంతో అనుసంధానిస్తారు.
హిమాయత్ సాగర్ అప్రోచ్ రోడ్డును అత్తాపూర్కు కలుపుతూ ఒక కొత్త ఫ్లైఓవర్ను నిర్మిస్తారు. దీనివల్ల- గాంధీ సరోవర్ చుట్టూ ఓ ప్రత్యేక ఎలివేటెడ్ కారిడార్ను సృష్టించినట్టువుతుంది. ఈ కారిడార్ ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఫలితంగా- నేరుగా ఎయిర్ పోర్ట్ కు రాకపోకలు సాగించడానికి వీలవుతుంది.
మంచినీటి సరఫరా- వరద నియంత్రణకు అనుగుణంగా మూసీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తుంది ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, వాటి నిర్వహణపై అధికారులు అధ్యయనం చేస్తారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ నిర్మాణంలో అమలు చేయనున్నారు.
వచ్చిన వరదనీరు వచ్చినట్టే తరలి వెళ్లేలా మూసీ ఫ్లడ్ ప్లెయిన్స్ కు ఇరువైపులా పెద్ద భూగర్భ నీటి నిల్వ సంపులు నిర్మిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రెండు నెలల్లో టెండర్లను ఆహ్వానించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్ వరదలను తట్టుకోవడానికి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ఒక్కటే ఆధారమని ఇదివరకే రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల హైదరాబాద్లో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించటం ద్వారా పరివాహక ప్రాంతంతో పాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలన్నీ సురక్షితంగా ఉండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురి కాకుండా ఉంటాయని రేవంత్ పేర్కొన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోని అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, నగరంలో ఉన్న హుస్సేన్సాగర్, దుర్గం చెరువు, మీర్ అలం చెరువులతో పాటు ప్రతీ చెరువు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications