ముత్తూట్లో 42 కిలోల గోల్డ్ చోరీలో రాజారత్నం, రాధ అరెస్ట్, అసలు ఏం జరిగింది?
సంచలనం రేపిన ముత్తూట్ ఫైనాన్స్ బంగారం దోపిడీ కేసులో కీలక నుందితుడు సుందర్ రాజారత్నంను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని ధారవి ప్రాంతంలో పట్టుబడ్డ అతన్ని సైబరాబాద్ తీసుకు వచ్చారు.
హైదరాబాద్: సంచలనం రేపిన ముత్తూట్ ఫైనాన్స్ బంగారం దోపిడీ కేసులో కీలక నుందితుడు సుందర్ రాజారత్నంను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని ధారవి ప్రాంతంలో పట్టుబడ్డ అతన్ని సైబరాబాద్ తీసుకు వచ్చారు. అతడి భార్య రాధను కూడా అరెస్టు చేశారు.
గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సమీపంలోని బీరంగూడ కమాన్సమీపంలో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో మహారాష్ట్ర దోపిడీ ముఠా సినీ ఫక్కీలో దాదాపు 42 కిలోల బంగారాన్ని దోచుకుంది.
22 ని.ల్లో సినీ ఫక్కీలో భారీగా బంగారం దోపిడీ, వారంలో అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు, 3.5 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు. మిగతా బంగారం అంతా రాజారత్నం వద్ద ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతడిని విచారిస్తున్నారు. రోషన్ కాలా అలియాస్ లంబు, తుకారం గైక్వాడ్లు పరారీలో ఉన్నారు.
ముంబైలో కార్పోరేటర్గా పోటీ కోసం..
మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం దొరెపల్లికి చెందిన రాజారత్నం కుటుంబం ముంబైలో స్థిరపడింది. ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కార్పోరేటర్గా పోటీ చేయడానికి టిక్కెట్ కోసం అతడు ప్రయత్నిస్తున్నాడని తెలిసిందే.
ఆ రోజు ఏం జరిగిందంటే..
2016, డిసెంబర్ 28న ఫైనాన్స్ కార్యాలయంలోకి వచ్చిన సిబ్బంది రోజువారీ విధుల నిర్వహణకు ఉద్యుక్తులవుతున్నారు. హఠాత్తుగా నలుగురు వ్యక్తులు లోపలికి వచ్చారు. హిందీలో మాట్లాడుతూ సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. అక్రమ లావాదేవీలపై ఫిర్యాదు అందిందని, తనిఖీ చేయాలంటూ లాకర్లలోని బంగారాన్ని బ్యాగులో వేసుకున్నారు. అభ్యంతరం చెప్పిన ఫైనాన్స్ సిబ్బందిని తుపాకీతో బెదిరించి పరారయ్యారు. ఈ దోపిడీ సినీ ఫక్కీలో జరిగింది. 25 నిమిషాల వ్యవధిలో 42 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.
సిబిఐ నుంచి వచ్చామని..
కార్యాలయంలో మేనేజర్ వెంకట్ రెడ్డి, సిబ్బంది రామకృష్ణ, అశోక్, శాంతమ్మ విధుల్లో నిమగ్నమై ఉండగా వాచ్మెన్ దేవదాస్ వద్దకు అయిదుగురు వ్యక్తులు వచ్చారు. తాము ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులమని చెప్పారు. తమతోపాటు ఉన్న ఓ ముసుగు వ్యక్తిని చూపించి.. ఇతను దొంగ సొత్తును మీ వద్ద దాచాడని, దీనిపై విచారణ జరపాలని చెప్పారు. వాచ్మెన్ అభ్యంతరం చెప్పినా తోసుకుని లోనికి ప్రవేశించారు. అందరి ఫోన్లు పక్కన పెట్టాలని ఆదేశించారు. తనిఖీ చేసేందుకు లాకర్లు తెరవాలని హుకుం జారీ చేశారు. అందుకు నిబంధనలు ఒప్పుకోవని, యాజమాన్యానికి చెప్పి అనుమతి తీసుకోవాలని మేనేజర్ చెప్పారు.
సీబీఐ చెప్తే అర్థం కాదా
ఆ సమయంలో దుండగులు సిబిఐ చెబితే అర్థం కాదా అంటూ సీబీఐ ముద్ర ఉన్న ఐడీ కార్డు చూపించడంతో సిబ్బంది లాకర్లను తెరిచారు. ఈ క్రమంలో దుండగులు బంగారు ఆభరణాల్ని అక్కడే ఉన్న బ్యాగ్లో సర్దుతుండటంతో అనుమానం వచ్చిన సిబ్బంది అడ్డుకున్నారు. అప్పుడు ఓ దుండగుడు తుపాకీ తీసి మేనేజర్ కణతకు గురిపెట్టాడు. అందరినీ బాత్రూం పక్కన మూలకు కూర్చోవాలని దుండగులు ఆదేశించారు. ఆభరణాల్ని సంచిలో తీసుకుని వెళ్తూ సీసీ కెమెరాల్ని, అలారంను ధ్వంసం చేశారు.
అలా వెలుగు చూసింది
చివరగా సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ఎక్కడుందో ఆరా తీసి తమ వెంట తీసుకెళ్లారు. కార్యాలయానికి బయట నుంచి గడియ పెట్టి కిందకు వెళ్లారు. తాము వచ్చిన వాహనంలో ఆభరణాల సంచిని ఉంచి మరోమారు పైకి వచ్చారు. వెంట తెచ్చుకున్న దుప్పట్లో మరికొన్ని ఆభరణాల్ని మూట గట్టుకుని పరారయ్యారు. ఓ వినియోగదారుడు కార్యాలయానికి వచ్చి గొళ్లెం తీయడంతో దోపిడీ విషయం వెలుగుచూసింది.
ఇలా పారిపోయారు
దుండగులు కర్ణాటకలోని కలబురగికి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. తొలుత పటాన్చెరు నుంచి భానూరు, శంకర్పల్లి, నవాబ్పేట మీదుగా దుండగులు వికారాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి దిశ మార్చుకొని మన్నగూడ మీదుగా పరిగి చేరుకొని, మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ పరారయ్యారు. అనంతరం తెలంగాణ సరిహద్దులను దాటి కర్ణాటకలోని కలబురగి వరకు వెళ్లినట్లు బుధవారం రాత్రి సమయంలో సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీస్ బృందాలు అక్కడికి వెళ్లాయి. ఘటనా స్థలం నుంచి కొన్ని వేలిముద్రల్ని సేకరించారు. యూపీలోని రాయ్బరేలి, కర్ణాటకలోని కలబురగిలలో ఈ తరహాలోనే దోపిడీలు జరిగినట్లు తెలియడంతో అంతర్రాష్ట్ర ముఠాల కోణంలో దర్యాప్తు చేపట్టారు.