తెలంగాణలో 'కొత్త' పోరు: కెసిఆర్కు 'ఉద్యమం' రివర్స్ అయ్యేనా?
హైదరాబాద్: తెలంగాణలో కొత్త పోరు ఆరంభమైంది! ఐదున్నర దశాబ్దాల ఉద్యమం తర్వాత వచ్చిన తెలంగాణలో.. అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ అన్నింటా విఫలమవుతోందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
ఇలాంటి సమయంలో మాజీ మంత్రి, బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ బచావో పేరుతో కొత్త వేదికను ప్రారంభించారు. అభివృద్ధి, విద్య, వైద్యం తదితరాల కోసం పోరాడుతామని నాగం చెబుతున్నారు. నిన్నటి వరకు తెలంగాణలో తెలంగాణ కోసం ఉద్యమం జరిగింది.
ఇప్పుడు, వచ్చిన తెలంగాణను ముందుకు తీసుకు పోయేందుకు బచావో తెలంగాణ అని చెబుతున్నారు. గతంలో నాగం తెలంగాణ నగారా పెట్టి విఫలమయ్యారనే చెప్పవచ్చు. అయితే, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసమంటూ.. ఆయన కొత్త వేదికను తెచ్చారు. అభివృద్ధి రాగం నాగంకు కలిసి వస్తుందా, కెసిఆర్కు 'ఉద్యమం' ఎదురు తిరుగుతుందా అనేది ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు.

టిఆర్ఎస్ బంగారు తెలంగాణ.. కాంగ్రెస్ నవ తెలంగాణ
పోరాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకుందామని టిఆర్ఎస్ చెబుతోంది. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, బంగారు తెలంగాణను సాధిస్తామని సిఎం కెసిఆర్, టిఆర్ఎస్ నేతలు పదేపదె చెబుతున్నారు.
కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ నవ తెలంగాణతో ముందుకు వచ్చింది. కెసిఆర్ అన్నింటా విఫలమవుతున్నారని, కావాల్సింది నవ తెలంగాణ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ కొద్ది రోజుల క్రితం చెప్పారు.
ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ బచావో పేరుతో వేదికను ఏర్పాటు చేశారు. నాగం ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు. నాగం తెలంగాణ బచావో వేదిక పైన ఆ పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ బచావోకు పార్టీ అనుమతి లేదని, అయితే మంచి పని చేస్తే అభినందించాల్సిందేనని బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. నాగం మాత్రం.. తాను కిషన్ రెడ్డికి చెప్పే ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తెలంగాణ బచావో వేదిక రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశం లేకపోలేదని అంటున్నారు. కెసిఆర్ పైన పోరు చేస్తున్న నాయకులు, తెలంగాణ బచావోను సమర్థించే ఇతర పార్టీల నాయకులు ఇందులో చేరాక.. దానిని రాజకీయ పార్టీగా ప్రకటించవచ్చునని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక... టిఆర్ఎస్ను ఎన్నో ఆశలతో ప్రజలు అధికారంలోకి తీసుకు వచ్చారని, కానీ అన్నింటా విఫలమవుతున్నారని టిడిపి, బిజెపి కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. కెసిఆర్ అభివృద్ధి, పథకాల పేరుతో ప్రజలను ఊహాలోకంలో విహరింప చేస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించడమే తప్ప చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు. ఓయులో పేదలకు ఇళ్లు, ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, ఎర్రగడ్డ ఆసుపత్రి తరలింపు, గ్రామజ్యోతి, మన గ్రామం - ప్రణాళిక అన్నీ ఆర్భాటానికే తప్ప ఏం చేయడం లేదని విమర్శిస్తున్నారు.
కెసిఆర్ అభివృద్ధి పేరుతో ప్రకటనలు చేస్తున్నారు తప్పితే ఏం చేయడం లేదని విపక్షాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో సాధించిన తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించేందుకు ఉద్యమాలు చేస్తామంటున్నాయి. ఇలాంటి సమయంలో నాగం తెలంగాణ బచావో వేదికను ప్రకటించారు.
మరోవైపు, ఓటుకు నోటు కేసులో నిందితుడు, తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ పైన ఏమాత్రం తగ్గడంలేదు. తెలంగాణలో టిడిపిని అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యత తనదేనని, కెసిఆర్ పాలనను దుయ్యబడతానని చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications