బీజేపీకి నాగం గుడ్ బై?: తెలంగాణ బచావో మిషన్ ఆవిర్భావం
హైదరాబాద్: గుడుంబా తాగితే అనారోగ్యం పాలైతే, ఛీప్ లిక్కర్ తాగితే ఆరోగ్యం చెడిపోదా తెలంగాణ బచావో మిషన్ వ్యవస్ధాపకులు నాగం జనార్ధన్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం హైదరాబాదులోని బషీర్బాగ్లో తెలంగాణ బచావో కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చీప్ లిక్కర్ ఆలోచన విరమించుకోవాలని సూచించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య, కరువు, ఆత్మహత్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఓ విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బచావో తెలంగాణ మిషన్ పోరాటం చేస్తుందని నాగం స్పష్టం చేశారు.

ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ చేర్చుకోవడం తప్పుకాదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులంతా డమ్మీలయ్యారని నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడాదిలో మూడుసార్లు కాన్వాయ్ మార్చారని, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను పేద రాష్ట్రంగా మార్చారని అన్నారు.
సెక్రటేరియెట్ను కూలగొట్టి బుర్జ్ఖలీఫా లాంటివి కట్టిస్తామంటున్నారని ఆయన విమర్శించారు. స్థానికతను వివాదం చేశారని, సంక్షేమపథకాలకు నిధులు కోత పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా, తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్వవహరించిన నాగం జనార్ధన్ రెడ్డి రాష్ట్ర విభజన అనంతరం తన ప్రాభవాన్ని కోల్పోయారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. బీజేపీలో కూడా ఆయనకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో ఇప్పుడు కొత్త కుంపటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. బీజేపీలో ఉంటూనే సాగు నీటి ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో ‘బచావో తెలంగాణ' పేరిట నాగం తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు.
ఈ యాత్రలే నాగం జనార్ధన్ రెడ్డిని బీజేపీకి దూరం చేశాయి. దీంతో 'బచావో తెలంగాణ మిషన్' పేరిట ప్రజావేదిక ఏర్పాటవుతోంది. ‘బచావో తెలంగాణ' పేరుతో బుధవారం ఆవిర్భవిస్తున్న ఈ వేదిక అయిదు కీలక అంశాలను లక్ష్యంగా నిర్దేశించుకుంది.
పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, విద్య, వైద్య రంగాల్లో కొనసాగుతున్న దుస్థితిని ఎత్తి చూపి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడం, రైతులు-కరవు పరిస్థితిని వివరిస్తూ తక్షణ సహాయ చర్యల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, అవినీతిని ఎండగట్టడం లక్ష్యంగా వేదిక కార్యాచరణ సిద్ధం చేసుకుంది.
ప్రస్తుతం నాగంతో పాటు ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఇందులో ఉన్నారు. తెలంగాణలో ఈ వేదిక ఆవిర్భావం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ప్రజల ఆకాంక్షలకు వేదికగా బచావో తెలంగాణ వేదిక కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీది అధికార పక్షానికి మిత్రపక్షమో? ప్రతిపక్షమో? తెలియడం లేదని ఎద్దేవా చేశారు. తమ వేదిక బలమైన ప్రతిపక్షంగా కొనసాగుతూ, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications