అక్కడ ఆయన..ఇక్కడ ఈయన: కదులుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
హైదరాబాద్: నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తోంది. ఏపీలోని తిరుపతి లోక్సభతో పాటు నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 17వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. చెప్పుకోవడానికి ఈ రెండుచోట్లా చెరొక స్థానమే అయినప్పటికీ.. ఎన్నికల వేడి మాత్రం ఎండ తీవ్రతతో పోటీ పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీటెక్కించింది. అటు తిరుపతి, ఇటు నాగార్జున సాగర్లల్లో త్రిముఖ పోటీ ఏర్పడటమే దీనికి కారణం. తమ పట్టును, స్థానాలను నిలుపుకోవడానికి అధికార పార్టీలు కసరత్తు చేస్తోన్నాయి.
ఈ నెల 14న ప్రచారానికి..
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారబరిలోకి ఏపీ ముఖ్యమంత్రి, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగడం ఖాయమైంది. ఈ నెల 14వ తేదీన ఆయన తిరుపతి శివార్లలోని రేణిగుంటలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు నాగార్జున్ సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ప్రచారం చివరిరోజు ఏపీలో వైెఎస్ జగన్ ప్రచారంలో పాల్గొనడం ఖాయంగా.. ఇక్కడ కేసీఆర్ బహిరంగ సభ షెడ్యూల్ ఇంకా తేలాల్సి ఉందని సమాచారం.
సాగర్లో విస్తృతంగా..
నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ ఖాతాలోనిదే. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. ఆయన కుమారుడు నోముల భగత్కు టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్. ఆయనను గెలిపించుకునే బాధ్యతను భుజాన వేసుకుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు ఈ ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా- కేసీఆర్ సైతం సాగర్ ఉప ఎన్నిక ప్రచారబరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది.
గాలి ఎటువైపు..
నాగార్జున సాగర్ నియోజవర్గం పరిధిలో టీఆర్ఎస్ కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జానారెడ్డి బరిలో ఉన్నారు. ఇదివరకు ఆయన నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహించారు. 2018 నాటి ఎన్నికల్లో నోముల నర్సింహయ్య చేతిలో ఏడువేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడాయన లేకపోవడం, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న రవికుమార్ నాయక్ కూడా కొత్త ముఖమే కావడం వల్ల నాగార్జున సాగర్ ఓటర్లు.. సీనియర్ అయిన జానారెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.