‘కాంగ్రెస్ చెల్లని రూపాయి-టిడిపి కనుమరుగు’
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెల్లని రూపాయిలా మారిందని, ఇక తెలుగుదేశం పార్టీ కనుమరుగైందని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. ఆ పార్టీ నేతలు మతిభ్రమించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరని మండిపడ్డారు. మానసిక ఒత్తిడికి గురవుతున్న కాంగ్రెస్ నాయకులు ఏదైనా మాట్లాడేముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, నాయకులు పలువురు శుక్రవారం తమ అనుచరులతో సహా టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో హోంమంత్రి వారికి టిఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో యువత బలిదానాలకు కాంగ్రెస్ నాయకులే కారణమని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే తెలంగాణలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకే ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిపై నాయిని విరుచుకుపడ్డారు. ఉత్తముడు అంటే మంచివాడని, ఆ పేరును ఆయన నిలబెట్టుకోవాలని సూచించారు. పక్క నియోజకవర్గంలో భార్యకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్న ఆయన కుటుంబ పాలనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్లో నెహ్రూ నుంచి రాహుల్గాంధీ వరకు వరుస వారసత్వ రాజకీయాలను పెట్టుకుని ఆ అంశంపై మాట్లాడే అర్హత వారికుందా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైందన్నారు. ఒకరిద్దరు నాయకులున్నా, వాళ్లు కూడా టీఆర్ఎస్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా తామే వద్దంటున్నామని తెలిపారు. వాళ్లను తీసుకోవద్దంటూ సీఎంపై ఒత్తిడి చేస్తున్నామని మంత్రి నాయిన చెప్పారు.