డాక్టర్లను ఇంటికి పంపాలా?: కేసీఆర్ ఆరోగ్యంపై మోడీ ప్రత్యేక శ్రద్ధ!
న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర మండలి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గత రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఫలితంగా రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో కూడా ఆయన కూర్చోలేకపోయారు.
అయితే సోమవారం మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన వరుస భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ... కేసీఆర్ను అత్యంత ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం కుదుటపడ్డాకే హైదరాబాదు వెళ్లాలని, అవసరమైతే ఎయిమ్స్ వైద్యులను కూడా కేసీఆర్ వద్దకు పంపిస్తానని మోడీ వ్యాఖ్యానించారు.
'అంతా ఓకేనా కేసీఆర్ జీ.. ఆరోగ్యం కుదుట పడిందా? రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి విశ్రాంతి తీసుకోండి కేసీఆర్ జీ. అవసరమైతే చెప్పండి... ఎయిమ్స్ వైద్యులను ఇంటికి పంపిస్తా. మొహమాటపడకండి' అని మోడీ కేసీఆర్తో అన్నారు.
మోడీ ఆప్యాయ పలకరింపునకు కేసీఆర్ పులకించిపోయారు. ఈ సందర్భంగా మోడీకి సమాధానమిచ్చిన కేసీఆర్ 'హైదరాబాద్ నుంచి ఆయుర్వేద వైద్యుడిని పిలిపించుకుని మందులేసుకున్నాను' అని చెప్పారు.
మారిన చొక్కా రంగు
టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సాధారణంగా వేసుకునే తెలుపు చొక్కాకు బదులు గోధుమ రంగు చొక్కా వేసుకున్నారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కేసీఆర్ తన చొక్కా రంగు తొలిసారి మార్చేశారు. ఢిల్లీ పర్యటన సాంతం ఆయన తన చొక్కా రంగు మార్చలేదులెండి. సోమవారం ఒక్కరోజు మాత్రం ఆయన తన చొక్కా రంగును మార్చేశారు.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ధరించే గోధుమ రంగు చొక్కా తరహాలో కాస్తంత లైట్ గోధుమ రంగు చొక్కాలో కేసీఆర్ దర్శనమిచ్చారు. ఖద్దరు కాని గోధుమ రంగు గుడ్డతో కుట్టిన సదరు షర్ట్ లో సోమవారం తన విడిది నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేసీఆర్ తో భేటీ సమయంలో మోడీ కూడా గోధుమ రంగు కుర్తాలోనూ ఉండటం గమనార్హం.
40నిమిషాలపాటు ఏకాంతంగా భేటీ
టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి ఒంటరిగా వెళ్లారు. ఆ సమయంలో తన వెంట వచ్చేందుకు యత్నించిన పార్టీ ఎంపీలను ఆయన వద్దని వారించారు. పార్లమెంటులోని ప్రధాని గది వద్దకు ఒంటరిగానే వెళ్లిన కేసీఆర్... మోడీతో దాదాపు 40 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరిపారు.
సోమవారం ప్రధానితో భేటీకి పార్లమెంటుకు చేరుకున్న కేసీఆర్ కు ఎదురేగి స్వాగతం పలికిన ఎంపీలు... ఆయనతో పాటే ప్రధాని వద్దకు వెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని వారించి 'మిమ్మల్ని వద్దని చెప్పినగా. ఎందుకొచ్చిండ్రు?' అని నిలదీశారు. దీంతో మిన్నకుండిపోయిన ఎంపీలు అక్కడే నిలబడిపోయారు. మోడీ గదికి కేసీఆర్ కదలగానే... ఎంపీలంతా సెంట్రల్ హాల్ కు వెళ్లారు. ఇక ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కేసీఆర్ కూడా సెంట్రల్ హాల్కు వెళ్లి తన పార్టీ ఎంపీలతో కలిసి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు.