జీవీఎంసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులదే విజయం
గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ (GVMC) స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 10 స్థానాలను గెలుచుకొని కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఏడుగురు అభ్యర్థులకు 60కి మించి ఓట్లు పడ్డాయి. అత్యధికంగా విల్లూరి భాస్కరరావు 66 ఓట్లు కైవశం చేసుకున్నారు.
జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంతో నేతలు సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు తినిపించుకుని కూటమికి అనుకూలంగా నినాదాలు చేశారు. కూటమి గెలుపుపై ఎమ్మెల్యేలు గండి బాబ్జి, వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేసి పార్టీ వీడతారన్న కార్పొరేటర్లతో చర్చించినా.. మిగిలిన వాళ్లతో క్యాంపు రాజకీయాలకు తెరలేపినా ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. ఇప్పటివరకు మూడు పర్యాయాలు జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికలు జరగగా మూడు సార్లు వైఎస్సార్సీపీ సభ్యులే గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో జోరు మీదున్న కూటమి స్థాయీ సంఘం ఎన్నికల్లో మూడు సంవత్సరాల తర్వాత అన్ని స్థానాలను కైవసం చేసుకుంది.
జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో స్థాయీ సంఘం ఎన్నికలు బుధవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జరిగాయి. పది స్థానాలకు వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కొక్కరికి పది ఓట్లు వేసే అవకాశం ఉండటంతో మొత్తం 960 ఓట్లు వేశారు. కూటమి తరఫున నిలబడిన టీడీపీ అభ్యర్థులు పది మంది అన్ని స్థానాలను వెఎస్సార్సీపీ ఓడించి గెలుచుకున్నారు. ఈ విజయంతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications