ప్రతికూల సర్వే నివేదికలు...! తడబడుతున్న గులాబీ బాస్..!!
హైదరాబాద్ : తెలంగాణాలో అదికార గులాబీ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు సర్వేలు నిర్దారిస్తున్నాయి.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ శాసనసభ మొత్తం 119 స్థానాలకు గాను అధికార పార్టీకి 43 స్థానాలు దక్కుతాయని ఇంటిలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో 35 స్థానాల్లో గట్టి పోటీ ఎదురవుతుందని నివేదికలో పేర్కొన్నట్టు చెబుతున్నారు. 100 స్థానాలు సాధిస్తామన్న ధీమాతో ముందస్తు ఎన్నికలకు తెరతీసిన చంద్రశేఖర్ రావుకు ఈ నివేదిక ఆందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. చేసిందంతా చెప్పినా ప్రజల నుంచి సానుకూలత లేకపోవడం ఆ పార్టీని కలవరపెడుతున్నట్టు సమాచారం. .!

తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పవనాలు..! రోజురోజుకీ వాడిపోతున్న గులాబీలు..!!
ప్రధానంగా మెదక్, కరీంనగర్, వరంగల్లు, నిజామాబాద్ జిల్లాల్లోనే ప్రజల్లో సానుకూలత ఉందని కూడా ఆ నివేదిక తేటతెల్లం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏర్పడిన సానుకూల పరిణామాలే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక గాలిని అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ జిల్లాల్లో కూడా సిట్టింగ్ అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉండడం, క్రమంగా ఆ వ్యతిరేకత పెరుగుతుండడంతో అభ్యర్థుల పేర్లు చివరి నిమిషంలో మార్చే అవకాశం ఉందేమోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ రద్దు నాటికి అంతా సానుకూలంగా ఉన్నాపార్టీ అభ్యర్థుల జాబితా అంతర్గత కలహాలను భగ్గుమనేలా చేసింది. మరోపక్క కాంగ్రెస్ నేతలపై ప్రజల్లో నమ్మకం లేకున్నప్పటికీ, క్రమంగా కూటమిలో ఐక్యత పెరుగుతుండడంతో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయి.

వాడితగ్గిన కేసీఆర్ వ్యాఖ్యానాలు..! చప్పబడ్డ స్పీచ్..!!
ఎప్పుడూ లేనట్లుగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తడబడుతోంది. గతంలో ఆయన గంట నుంచి రెండు గంటల వరకూ మాట్లాడినా, ప్రత్యర్థులకు ఆయన అంత తేలిగ్గా దొరికేవారు కాదు. కానీ.. ఇప్పుడు చంద్రశేఖర్ రావు మాటలు తొట్రుబాటుకు లోనవుతున్నాయి. ముందు మాటకు.. వెనుక మాటకు సంబంధం లేన్నట్లుగా మాట్లాడటం ఈ మధ్యన కేసీఆర్ మాటల్లో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికల హామీలకు సంబంధించిన ప్రకటన కోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉండటమే కాదు, ఆయన మాటల్లో వైరుధ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పాలి.

మాటల మాంత్రికుడికి మారుపేరు కేసీఆర్.! కానీ తడబడుతున్న ఉపన్యాసాలు..!!
ఒకవైపు తెలంగాణ బిడ్డలేనని చెబుతూనే ఆంధ్రోళ్లు అంటూ పదే పదే కేసీఆర్ ప్రస్తావిస్తున్న వైనం చూస్తే, కేసీఆర్ మాటల్లో తేడా అర్థం కాక మానదు. గ్రేటర్ ఎన్నికల్లో ఆంధ్రోళ్లు ఓటు వేయలేదన్న కేసీఆర్ కామెంట్ చూస్తే.. తెలంగాణలో ఏళ్ల తరబడి ఉన్న వారంతా ఎవరు? అన్న విషయంపై కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. సెటిలర్స్ లేరన్న మాటను చెబుతూనే, అదే నోటితో ఆంధ్రోళ్లు అనటం చూస్తే, హైదరాబాద్లో ఉన్న వారికి సంబంధించి విభజన రేఖను కేసీఆర్ చాలా స్పష్టంగా గీస్తున్నట్లు చెప్పక తప్పదు.

అప్రస్తుతంగా మారిన ప్రాంతీయ వాదం..! అదే లైన్ లో కేసీఆర్..!!
ఓవైపు తెలంగాణ సమాజంలో కలిసిపోయారన్న కితాబు ఇస్తూనే, మళ్లీ వారిని వేరుగా వేలెత్తి చూపిస్తున్న కేసీఆర్ తీరు అభ్యంతరకరమనే అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి ధోరణితో కేసీఆర్ ఉంటే, మరి కొన్నేళ్ల తర్వాత కూడా ఆంధ్రోళ్లు అన్న ట్యాగ్ ను వదిలిపెట్టరని చెప్పక తప్పదు. అందుకే.. ఆంధ్రోళ్లు.. సెటిలర్లు అన్న పదాల్ని తక్షణమే వాడనన్న హామీని కేసీఆర్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఒకవేళ చంద్రశేఖర్ రావు ఆ హామీ ఇవ్వలేదంటే ఆయన మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పక తప్పని పరిస్తితులు తలెత్తాయి.












Click it and Unblock the Notifications