‘కేసీఆర్! ఆ 15కోట్లూ కవిత కోసమేనా?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆయన కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితపై తెలంగాణ పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. బతుకమ్మ పండగ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 15కోట్లు కేవలం సీఎం తన కూతురు కవిత కేటాయించారని అన్నారు.
నేరెళ్ల శారద
ఆమె సోమవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కేవలం కేసీఆర్ తన బిడ్డ కోసం, రాజకీయ అవసరాల కోసం కాకుండా బతుకమ్మ పండగ సంస్కృతిని కాపాడటానికి ప్రజల సొమ్మును ఖర్చు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు.
బిడ్డ కోసమేనా?
కేసీఆర్ ఎక్కడ బతుకమ్మ ఆడితే అక్కడ నిధులు కేటాయించడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 15 కోట్లు ఏయే గ్రామాలకు ఎంత కేటాయించారో, ఆ నిధులతో బతుకమ్మ పండగ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ నిధులను అన్ని గ్రామ పంచాయతీలకు నేరుగా కేటాయించాలని అన్నారు.
షబ్బీర్ అలీ
హైదరాబాద్ నగరంలోని నాలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తోందని.. మండలిలో విపక్ష నేత షబ్బీర్అలీ తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి మాటమీద నిలబడతారనే నమ్మకం తమకు లేదని వ్యాఖ్యానించారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై..
కాంగ్రెస్ హయాంలో నాలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే... తెరాస ప్రభుత్వం జీవో 58, 59 తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించింది నిజం కాదా అని ప్రశ్నించారు. నాలాలపై అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ సహకరిస్తుందని స్పష్టం చేశారు.