ఫిబ్రవరి నాటికి యాదాద్రి సిద్ధం..! పనులు వేగవంతం
Recommended Video

యాదాద్రి : నవ యాదాద్రి రూపుదాల్చుతోంది. కొత్త శోభ సంతరించుకుంటూ భక్తులకు కనువిందు చేయనుంది. రెండేళ్లుగా కొనసాగుతున్న విస్తరణ పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈక్రమంలో పునఃప్రతిష్ఠాపన మహోత్సవానికి ముహుర్తం ఖరారు కానుంది. అంతా అనుకున్నట్లు సవ్యంగా జరిగితే ఫిబ్రవరిలో నవ యాదాద్రి అందుబాటులోకి రానుంది.
కాకతీయుల కళావైభవం, సప్తగోపురాలు, అష్టభుజి ప్రాకారాలు.. ఇలా ఎన్నో అద్భుతాలు యాదాద్రి సొంతం కాబోతున్నాయి. ఏడుకొండలవాడి సన్నిధి తిరుమలను తలపించేలా యాదాద్రి కొత్త హంగులు సంతరించుకుంటోంది.

కేసీఆర్ సంకల్పం.. నవ యాదాద్రి
లక్ష్మి నరసింహ స్వామి కొలువుదీరిన యాదాద్రికి కొత్త శోభ తీసుకురావడంలో సీఎం కేసీఆర్ పాత్ర అనిర్వచనీయం. తెలంగాణ సిద్ధించి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాదాద్రిపై దృష్టి సారించారు. యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చి తిరుమల స్థాయిలో పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేలా కంకణం కట్టుకున్నారు. సమూల మార్పులు చేస్తూ కొత్త డిజైన్ రూపొందించి త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో పనులు వేగవంతం చేశారు. దాదాపు 80 శాతం మేర పనులు పూర్తయినట్లు సమాచారం. మిగతా పనులు కూడా రెండు నెలల్లోగా పూర్తిచేయాలని అధికారులను పురమాయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరిలో ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది.

ఈసారి బ్రహ్మోత్సవాలు కొత్త యాదాద్రిలోనా?
నవ యాదాద్రి పూర్తవుతున్న తరుణంలో త్రిదండి చినజీయర్ స్వామి సూచనల మేరకు ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఖరారు చేయనున్నారు సీఎం కేసీఆర్.
గర్భాలయ దర్శనమూర్తుల పునఃప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను వైదిక, ఆగమశాస్త్రాల ప్రకారం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నవ యాదాద్రి ప్రారంభానికి ఫిబ్రవరి 17వ తేదీని ఖరారు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తానికి అంతా ఓకే ఐతే.. ఈసారి స్వామివారి బ్రహ్మెత్సవాలు (మార్చి 8 - 18) కొత్త యాదాద్రిలో జరగనుండటం విశేషం.

నల్లరాతి శిల.. చెక్కుచెదరని సౌందర్యం
యాదాద్రి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం సుమారుగా వెయ్యి కోట్ల వరకు ఖర్చుపెడుతున్నట్లు అంచనా. రెండు సంవత్సరాల నుంచి దాదాపు వెయ్యి మంది శిల్పులతో పాటు కార్మికులు ఇతరత్రా నవ యాదాద్రి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక్కడ మరో స్పెషాలిటీ ఏంటంటే.. మాగ్జిమమ్ నల్ల రాతి శిలను వాడుతున్నారు. ఎన్ని కాలాలపాటైనా చెక్కు చెదరని శిలా సౌందర్యంతో నవ యాదాద్రి భక్తులకు కనువిందు చేయనుంది. భక్తకోటికి కొంగుబంగారంగా నిలుస్తున్న యాదాద్రి నారసింహుడి పుణ్యక్షేత్రం త్వరలోనే సరికొత్త శోభతో అలరించనుంది.












Click it and Unblock the Notifications