తెలంగాణలో వరుసగా రెండో రోజూ: రెండువేలకు పైగా: 7 జిల్లాల్లో: సెకెండ్ టైమ్ 40 వేలకు టచ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల నమోదవుతోంది. రోజువారీ కేసుల సంఖ్య రెండు వేలకు లోపే నమోదవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కసారిగా అవి పెరిగిపోయాయి. వరుసగా రెండో రోజు కూడా రెండువేలకు పైగా పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో రికార్డు స్థాయిలో 40 వేలకు పైగా కరోనా పరీక్షలను నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పెరుగుతున్న టెస్టులకు అనుగుణంగా కేసులూ అదే రేంజ్లో వెలుగులోకి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

మరోసారి రెండు వేలకు పైగా..
తెలంగాణలో వరుసగా రెండో రోజూ పాజిటివ్ కేసుల సంఖ్య రెండువేల మార్క్ను అధిగమించింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా తెలంగాణలో కొత్తగా 2384 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 11 మంది మరణించారు. 1851 మంది డిశ్చార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,04,249కు చేరుకుంది. ఇందులో 80,586 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 755కు చేరుకుంది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 22,908గా నమోదైంది. గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 16,379 మంది చికిత్స పొందుతున్నారు.

రంగారెడ్డి.. డబుల్ సెంచరీ
తెలంగాణలో నమోదైన మొత్తం కేసుల్లో అధికవాటా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్దే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల్లో కొత్తగా 472 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. దీనికి ఏ మాత్రం తీసిపోని విధంగా మారాయి జిల్లాలు కూడా. ఏడు జిల్లాల్లో వందకు పైగా కరోనా రోజువారీ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట్ జిల్లాల్లో సెంచరీ మార్క్ దాటేశాయి. మంచిర్యాల, వరంగల్ అర్బన్లోనూ పరిస్థితి అదే స్థాయిలో ఉంటోంది.

జిల్లాలవారీగా వివరాలివే..
24 గంటల్లో కొత్తగా ఆదిలాబాద్-25, భద్రాద్రి కొత్తగూడెం-52, జగిత్యాల-105, జనగామ-30, జయశంకర్ భూపాలపల్లి-7, జోగుళాంబ గద్వాల-68, కామారెడ్డి-69, కరీంనగర్-120, ఖమ్మం-105, కొమరంభీమ్ ఆసిఫాబాద్-12, మహబూబ్ నగర్-61, మహబూబాబాద్-52, మంచిర్యాల-90, మెదక్-24, మేడ్చల్ మల్కాజ్గిరి-52, ములుగు-19, నాగర్ కర్నూలు-29, నల్లగొండ-137, నారాయణపేట్-13, నిర్మల్-19, నిజామాబాద్-148, పెద్దపల్లి-65, రాజన్న సిరిసిల్ల- 42, రంగారెడ్డి-131, సంగారెడ్డి-61, సిద్ధిపేట్-67, సూర్యాపేట్-110, వికారాబాాద్-19, వనపర్తి-47, వరంగల్ రూరల్-21, వరంగల్ అర్బన్-85, యాదగిరి భువనగిరి-28 కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video

40 వేలకు పైగా టెస్టులు..
24 గంటల వ్యవధిలో మొత్తం 40,666 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్లో పేర్కొన్నారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 9,31,839కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 25,099 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో మొత్తం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాలు 1076 ఉన్నాయి. వాటిని ప్రభుత్వమే నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications