Revanth Reddy: ఆసుపత్రికెళ్లి మరీ వీహెచ్ బ్లెస్సింగ్స్: సీనియర్ల ప్రసన్నం కోసం వ్యూహాత్మకం
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితుడైన పార్టీ నాయకుడు, మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు రేవంత్ రెడ్డి.. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోన్నారు. తనను నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న కొందరు పార్టీ సీనియర్ల నాయకుల దూకుడును అడ్డుకట్ట వేయడంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తోన్నారు. ఒక్కొక్కరి పట్ల ఒక్కో విధానాన్ని అనుసరిస్తోన్నారు. అనారోగ్యానికి గురై.. హైదర్గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంత రావును ఆసుపత్రికెళ్లి మరీ పరామర్శించారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.
Recommended Video
అధిష్ఠానం దృష్టికి కోమటిరెడ్డి వ్యాఖ్యలు..
అదే సమయంలో- తోటి లోక్సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల రేవంత్.. మరో రకంగా స్పందించినట్లు కనిపిస్తోంది. తన నియామకాన్ని తప్పు పడుతూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను నేరుగా పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ మెట్లు కూడా తొక్కబోనంటూ చేసిన కామెంట్లపై స్పందించనప్పటికీ.. అధిష్ఠానం నుంచి అక్షింతలు వేయించారనే ప్రచారం అప్పుడే వినిపిస్తోంది కూడా. రేవంత్ నియామకం పట్ల ఎలాంటి అసంతృప్తిని వ్యక్తం చేయకూడదంటూ అధిష్ఠానం సీనియర్లకు సంకేతాలు ఇచ్చిందని అంటోన్నారు.
వీహెచ్ను పరామర్శ
కాగా- ఈ ఉదయం రేవంత్ రెడ్డి హైదర్గూడలోని అపోలో ఆసుపత్రిలో వీహెచ్ను పరామర్శించారు. పార్టీ సీనియర్ నాయకుడు జీ చిన్నారెడ్డి, మల్లురవిలతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన ఆయన వీహెచ్ను కలిశారు.
యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతోన్న వైద్య చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వేగంగా కోలుకోవాలని అకాంక్షించారు. అనంతరం రేవంత్ రెడ్డి ఆసుపత్రి ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ సర్కార్ కొత్తగా ప్రకటించిన దళిత సాధికార పథకంపై నిప్పులు చెరిగారు.
కేసీఆర్ సర్కార్పై ఫైర్..
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం దళిత విద్యార్థులకు అత్యున్నత విద్యను అందించిందని అన్నారు. దళితుల పేరు చెప్పుకొంటూ కేసీఆర్ అదే వర్గాన్ని మోసం చేస్తోన్నారని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటిదాకా దాని ఊసే ఎత్తట్లేదని, తాను మాత్రం పెద్ద బంగళా కట్టుకున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి వందమందిని ఎంపిక చేసి, వారికి 10 లక్షల రూపాయలను ఇస్తామని కేసీఆర్ ఏ ప్రాతిపదికన ప్రకటించారని ప్రశ్నించారు. లక్షమంది ఉన్న
సీనియర్లందరినీ కలుస్తా..
తాను పార్టీలో ఉన్న ప్రతి ఒక్క సీనియర్ నాయకుడినీ కలుస్తానని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదివరకే ఆయన జానారెడ్డితో భేటీ అయ్యారు. తాజాగా వీ హనుమంతరావును కలుసుకున్నారు. కేసీఆర్ సర్కార్ను ఢీ కొట్టడానికి పార్టీని సమాయాత్త చేస్తానని, దీనికోసం సీనియర్ల అండదండలు, సలహాలు, సూచనలు అవసరమని అన్నారు. పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి.. మరోసారి సోనియాగాంధీని కలుస్తానని చెప్పారు. దీనికి వీహెచ్ సైతం అంగీకారం వ్యక్తం చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.