వెదర్ అలర్ట్: తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. తాజాగా, మరోసారి వాతావరణ శాఖ భారీ వర్ష సూచనలు చేసింది. రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం నుంచి ఆదివారం వరకు 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ వనపర్తి, నారాయణపేటలో మోస్తరు నుంచి భారీ వర్షాలతోపాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
అల్పడీనంతో ఏపీలోనూ భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రానున్న రెండు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రం కొంత అల్లకల్లోలంగా ఉంటుందని, ఉత్తర బంగాళాఖాతంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.












Click it and Unblock the Notifications