డేంజరస్ మౌంట్ కిలిమంజారోపై జెండా పాతిన టాలీవుడ్ హీరోయిన్: త్రివర్ణ పతాకంతో
హైదరాబాద్: మౌంట్ కిలిమంజారో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వత శిఖరాల్లో ఒకటి. అదే స్థాయిలో అత్యంత ప్రమాదకరమైనది కూడా. ఆఫ్రికాలోని టాంజానియాలో ఉంటుందీ శిఖరం. ఈ పర్వత శిఖరాగ్రంపై క్షణక్షణానికి వాతావరణం మారుపోతుంటుంది. మంచుతో కప్పి ఉండే ఈ పర్వతం ప్రధాన శిఖరం కిబోను అందుకోవాలంటే 5,885 మీటర్లను అధిగమించాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరే క్రమంలో ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు, బలమైన ఈదురుగాలులను ఎదుర్కొని నిల్చోవాల్సి ఉంటుంది.
షాడో కేప్టెన్: టీమిండియా మెంటార్గా ధోనీ సత్తాకు సిసలు పరీక్ష: జట్టులో లేకున్నా..జట్టుతో
5,895 మీటర్ల ఎత్తున..
అలాంటి సంక్లిష్టమైన యాత్రను విజయవంతంగా చేశారు టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్. నిద్రాణంగా ఉన్న అగ్నిపర్వతం మౌంట్ కిలిమంజారో. మావెన్జీ, షిరా, కీబో.. అనే మూడు అతి ఎత్తయిన పర్వత శిఖరాలను కలిగి ఉంటుంది. ఇందులో మావెన్జీ ఎత్తు-5,149 మీటర్లు. షిరా హైట్-3,962 మీటర్లు. కాగా అత్యంత ఎత్తయినది కీబో. దీని ఎత్తు 5,885 మీటర్లు. కీబో శిఖరంలోని ఉహురు పీక్ ఇంకో 10 మీటర్లు ఎత్తుగా ఉంటుంది. సముద్రమట్టం నుంచి 5,895 మీటర్ల ఎత్తున ఉంటుంది ఉహూరు పీక్.
జాతీయ జెండాతో..
మౌంట్ కిలిమంజారోలో భాగమైన కీబోలో హయ్యెస్ట్ పాయింట్ ఇదే. ఇదే చిట్టచివరిది. ప్రతి సంవత్సరం 25 వేల నుంచి 35 వేల మంది పర్యాటకులు ఉహురు పీక్ను చేరుకుంటుంటారు. ఇప్పుడీ పీక్ పాయింట్కు చేరుకున్నారు నివేదా థామస్. ఉహురు పీక్ పాయింట్ వద్ద అమర్చిన డెస్టినేషన్ బోర్డు వద్ద నిల్చున్న ఓ ఫొటోను ఆమె తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. త్రివర్ణ పతాకాన్ని కప్పుకొన్న ఫొటో అది. ఐ మేడ్ ఇట్.. టు ద టూ ఆఫ్ ద టాలెస్ట్ ఫ్రీ స్టాండింగ్ మౌంటెయిన్ ఇన్ ద వరల్డ్.. మౌంట్ కిలిమంజారో.. అనే కామెంట్స్ను జత చేశారు.
ట్రెక్కింగ్ కోసం ట్రైనింగ్..
కిలిమంజారో ట్రెక్కింగ్ కోసం నివేదా థామస్ సుమారు ఆరు నెలలుగా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన కొంతమంది స్నేహితులతో కలిసి ఆమె ఈ ట్రెక్కింగ్ను కంప్లీట్ చేశారని సమాచారం. అత్యంత సంక్లిష్టమైన వాతావరణంతో కూడిన కిలిమంజారోను అధిరోహించడానికి అవసరమైన శారీరక, మానసిక సామర్థ్యాన్ని సమకూర్చుకోవడానికి ట్రెక్కింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరారని చెబుతున్నారు.
వకీల్ సాబ్ తరువాత..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ క్యారెక్టర్లో కనిపించిన వకీల్ సాబ్లో నటించారు నివేదా థామస్. ప్రస్తుతం ఆమె రెజీనాతో కలిసి ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. సూపర్ హిట్ మూవీ మిడ్నైట్ రన్నర్స్ అనే కొరియన్ సినిమాకు రీమేక్ ఇది. స్వామిరారా, దోచెయ్, కేశవ, కిరాక్పార్టీ ఫేమ్ సుధీర్ వర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. అర్ధరాత్రి పూట చోటు చేసుకునే కిడ్నాప్ల రహస్యాన్ని ఛేదించే ఇద్దరు ట్రైనీ కాప్స్ క్యారెక్టర్లో నివేదా థామస్, రెజీనా నటిస్తున్నారు. తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.