నిజామాబాద్ పసుపు రైతుల మరో పోరాటం .. డిమాండ్స్ సాధించేవరకు ఉద్యమం
గత ఎన్నికల సమయంలో ఎన్నికల్లో పోటీ చేసి దేశం దృష్టిని ఆకర్షించినా, ఏకంగా తెలంగాణా సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఓటమిపాలు చేసినా పసుపు రైతుల డిమాండ్స్ మాత్రం నెరవేరలేదు. పసుపు బోర్డు ఏర్పాటు జరగలేదు. దీంతో పసుపు రైతులు మరోమారు ఉద్యమానికి రెడీ అవుతున్నారు. పసుపు పంటకు, ఎర్రజొన్నకు మద్దతు ధర ఇవ్వాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్తో నిజామాబాద్ జిల్లాలో రైతులు మరోమారు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి ఉద్యమం చాలా పెద్ద ఎత్తున వ్యూహాహ్మకంగా చెయ్యాలని నిర్ణయించారు. ఈ సారి తమ డిమాండ్ సాధించేవరకు ఉద్యమం కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు రైతులు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరిన పసుపు రైతులు
ఉద్యమంలో భాగంగా ముందుగా తమ సమస్య పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. అందరికీ వినతి పత్రాలు ఇచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చెయ్యాలని కోరనున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను పసుపు రైతులు కలిశారు. ఆయనతో రైతులు వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అయితే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పసుపు రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్న ఎంపీ అరవింద్ పసుపు బోర్డు విషయంలో శాఖా పరమైన చర్చలు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయని తెలిపారు. ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని రైతులకు తెలిపారు అరవింద్.
గిట్టుబాటు ధర , పసుపు బోర్డు రైతుల ప్రధాన డిమాండ్లు
పసుపు పంటను ఆహార ధాన్యాల పంటగా గుర్తించడంతో పాటు కనీస మద్దతు ధర రూ. 15వేలు ప్రకటించాలని పసుపు రైతు సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఎర్రజొన్న పంటకు కేసీఆర్ ప్రకటించిన బోనస్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎర్రజొన్నలకు రూ. 3500 మద్దతు ధర ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పసుపు, ఎర్ర జొన్న పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వటం, అలాగే పసుపు బోర్డు ఏర్పాటు చెయ్యటం అనే ప్రధాన డిమాండ్లతో ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల నాలుగు ప్రధాన డిమాండ్లపై ప్రజాప్రతినిధులు ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ సారి ప్రణాళికాబద్దంగా మలిదశ పసుపు రైతు పోరాటం .. గణేష్ ఉత్సవాల అనంతరం గ్రామస్థాయి నుండి ఉద్యమం
ఇక ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వటంతో పాటు గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యపరిచేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. ఈ దఫా పోరాటం తమ న్యాయమైన డిమాండ్స్ సాధించేవరకు కొనసాగించాలని భావిస్తున్న నేపధ్యంలోనే పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు పసుపు రైతులు. ఇక పసుపు బోర్డు కోసం గణేష్ ఉత్సవాల అనంతరం గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశలో రైతులు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలోనే ఊహించని విధంగా ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం సృష్టించిన రైతులు ఈ సారి పోరాటానికి సిద్ధం అంటున్న నేపధ్యంలో ఇంకా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.