ఎన్టీఆర్ తరహా పాలిటిక్స్, తెలంగాణలో ఆత్మ: హాట్ డిబేట్, జగన్ మొదలు!
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి రాజకీయ నాయకుల నోటి నుంచి ఎన్టీఆర్ పేరు పదేపదే వినిపిస్తోంది. చంద్రబాబు నుంచి టీడీపీలో చేరాలనుకుంటున్న నటి వాణీ విశ్వనాథ్, జగన్ దాకా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు.
కడప: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి రాజకీయ నాయకుల నోటి నుంచి ఎన్టీఆర్ పేరు పదేపదే వినిపిస్తోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నుంచి టీడీపీలో చేరాలనుకుంటున్న నటి వాణీ విశ్వనాథ్ వరకు, ఏపీలో ప్రతిపక్ష వైసిపి నుంచి తెలంగాణలో రాష్ట్రం దాకా ఆయన పేరును పలవరిస్తున్నారు.
తెలుగురాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మళ్లీ ఎన్టీఆర్ పేరును వినిపిస్తున్నారు. సాధారణంగా చంద్రబాబును విమర్శించడానికి విపక్షాలు ఆయన పేరును పదేపదే ఉపయోగిస్తాయి. ఇప్పుడు మళ్లీ అదే బాట పట్టారు.
ఎన్టీఆర్ తరహాలో తన రాజకీయమని జగన్
తాజాగా పాదయాత్ర చేపట్టిన జగన్.. ప్రత్యేక హోదాపై తెలుగువారి ఆత్మగౌరవం మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ తరహాలోనే తన రాజకీయం ఉంటుందని జగన్ అన్నారని, ఇది చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. మరోవైపు, ఏపీలో ప్రభుత్వం అన్న క్యాంటీన్లు, ఎన్టీఆర్ సుజల స్రవంతి లాంటి పథకాలు ప్రారంభిస్తోంది. తద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది.
ఎన్టీఆర్ ఆత్మ తెలంగాణలో ఉందని చంద్రబాబు
తెలంగాణ టీడీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అధైర్య పడొద్దు, ఎన్టీఆర్ ఆత్మ ఇక్కడే ఉంది అని బాబు అన్నారు. ఎప్పటికైనా బలపడతామని ధైర్యం చెప్పారు.
మరోవైపు బయోపిక్స్
రాజకీయాల సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ పైన సినిమా ఇండస్ట్రీ ఏకంగా మూడు సినిమాలు తీసేందుకు సన్నద్ధమయింది. మూడు బయోపిక్లు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. ఇందులో ఒకటి ఆత్మకథ, రెండోది ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చినప్పటి నుంచి ఆయన మృతి వరకు, మూడోది లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ఎలా వచ్చిందో చెప్పనున్నారు.
అమ్మకానికి ఇల్లు
ఇదిలా ఉండగా, అన్నగారి ఇల్లు కూడా ఇటీవల చర్చకు దారితీసింది. చెన్నై టీ నగర్ లోని 28 బజుల్లా రోడ్లో ఉన్న ఎన్టీఆర్ ఇల్లు అమ్మకానికి పెట్టినట్లు అక్కడి బోర్డు చెబుతోంది. ఇది చూసి చాలామంది విలవిలలాడిపోయారు.
చెదిరిపోతుందా అనే ఆందోళన
ఆ ఇంటిని అమ్మకానికి ఎందుకు పెట్టినట్లు? ఎవరైనా కొంటారా అని అన్నగారిల్లు దీనంగా ఎదురు చూడటం ఏమిటి? ఎన్టీఆర్ ఇల్లు ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం ఏమిటి? అంటూ చర్చ జరుగుతోంది. చెన్నైలో చెరిగిపోయిన అనేక తెలుగు గురుతుల్లో ఇది కూడా చేరుతుందా అనే ఆందోళన అందరిలో ఉంది. హైదరాబాదులోని ఎన్టీఆర్ ఇల్లు కూడా చర్చనీయాంశమైంది.