ఈటల గారు కాపాడండి... మరో ప్రైవేట్ ఆస్పత్రి దుర్మార్గం.. మరో డాక్టర్ కన్నీటి పర్యంతం..
ఇటీవల ఫీవర్ ఆస్పత్రి డీఎంవో సుల్తానాను తుంబే ఆస్పత్రి యాజమాన్యం నిర్బంధించిన ఘటన మరిచిపోకముందే... హైదరాబాద్లో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ఫీజుల పేరుతో తమను వేధిస్తున్నారంటూ ఎన్ఆర్ఐ డాక్టర్ విజయ కేసరి ఓ వీడియో విడుదల చేశారు. ఆక్సిజన్,వెంటిలేటర్ పెట్టకపోయినా,ప్రత్యేక చికిత్స ఏమీ అందించకపోయినా.. ఇష్టమొచ్చినట్లు బిల్లులు వేసి కట్టాలని బెదిరిస్తున్నట్లు వాపోయారు. మంత్రి ఈటల రాజేంద్ర గారే తమను కాపాడాలంటూ వీడియోలో విజ్ఞప్తి చేశారు.

డా.విజయ్ కేసరి ఏమంటున్నారు...
'మా నాన్న క్యాన్సర్ పేషెంట్. సాధారణ చెకప్స్ కోసం వస్తే కోవిడ్ 19 పరీక్షలు చేసి పాజిటివ్ అని చెప్పారు. దీంతో జూన్ 25న మా నాన్నను అదే ఆస్పత్రిలో ఐసోలేషన్లో చేర్చాం. ఆ తర్వాత నాకూ టెస్టులు చేయాలని చెప్పి శాంపిల్స్ తీసుకున్నారు. ఆరు రోజులకు ఆశా వర్కర్స్,అధికారులు ఫోన్ చేసి నాకు పాజిటివ్ అని చెప్పారు. నిజానికి నాకు,మా నాన్నకు ఎలాంటి లక్షణాలు లేవు.' అని విజయ కేసరి చెప్పుకొచ్చారు.

స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ లేదు...
'పాజిటివ్ అని చెప్పాక.. జూన్ 30న, నేనూ మా నాన్న చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో,అదే గది నం.856లో ఐసోలేషన్లో చేరాను. మా నాన్న సొంతగా తినలేరు. అక్కడి సిబ్బంది కనీసం ఆయనకు ఫుడ్ కూడా తినిపంచలేదు. కనీసం డైపర్స్ కూడా మార్చలేదు. అప్పటినుంచి ఇప్పటివరకూ మాకు ప్రత్యేకమైన చికిత్స గానీ మందులు గానీ ఇవ్వలేదు. కేవలం యాంటీ బయాటిక్,విటమిన్ సీ మాత్రమే ఇచ్చారు. మా నాన్నకు కూడా డయాబెటీస్ మందులతో పాటు ఈ మందులు మాత్రమే ఇచ్చారు. ఆక్సిజన్ గానీ వెంటిలేటర్ ట్రీట్మెంట్ గానీ ఇవ్వలేదు. అయినప్పటికీ బిల్లు మాత్రం భారీగా వేశారు.' అని విజయ కేసరి చెప్పుకొచ్చారు.

భారీ బిల్లు... మంత్రి ఈటలకు విజయ కేసరి విజ్ఞప్తి...
'దాదాపు రూ.3లక్షలు పైచిలుకు బిల్లు వేశారు... ఇంత బిల్లు అసలు ఎందుకు కట్టాలో అర్థం కావట్లేదు. మమ్మల్ని చెకప్ చేయని డాక్టర్లకు కూడా చార్జీలు వసూలు చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే అవేమీ అడగవద్దంటున్నారు. గట్టిగా నిలదీస్తే డిశ్చార్జి చేస్తామంటున్నారు. వాళ్ల ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డితో మాట్లాడుతానంటే ఒప్పుకోవట్లేదు. ఇంత ఘోరమా... దయచేసి ఈటల రాజేంద్ర గారు సాయం చేయండి.' అంటూ విజయ కేసరి కన్నీంటిపర్యంతం అయ్యారు. ఇటీవల ఫీవర్ ఆస్పత్రి డీఎంవో సుల్తానాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైన సంగతి తెలిసిందే. కేవలం 24గంటలకే రూ.1.15లక్షలు బిల్లు వేసిన ఆస్పత్రి యాజమాన్యం... ఇంత బిల్లు ఎందుకని ప్రశ్నించినందుకు ఆమెను నిర్బంధించారు. చివరకు మంత్రి ఈటల జోక్యంతో ఆమె బయటకొచ్చారు.












Click it and Unblock the Notifications