కరోనా ఎఫెక్ట్.. ఉస్మానియా విద్యార్థులకు షాకిచ్చిన వీసీ..
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటిని మార్చి 31వరకు మూసివేయాలని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. కేవలం పదో తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రమే షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని చెప్పింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం యూనివర్సిటీల్లో క్లాసులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఆయా యూనివర్సిటీల్లో విద్యార్థులు మాత్రం హాస్టళ్లలోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఇంకా హాస్టళ్లల్లోనే ఉంటున్నట్టు సమాచారం. దీంతో విద్యార్థులు హాస్టల్స్ ఖాళీ చేయాల్సిందిగా వీసీ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి హాస్టళ్లకు విద్యుత్,నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణలో ఇప్పటివరకు 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అనుమానిత కేసులకు సంబంధించి పుణే వైరాలజీ ల్యాబ్ నుంచి ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం వారికి సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా ప్రభావం రాష్ట్రంపై అంతగా లేనప్పటికీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో మాల్స్,థియేటర్స్ మార్చి 31 వరకు బంద్ చేయాలని ఆదేశించింది. అలాగే పబ్లిక్ ఈవెంట్స్ను కూడా రద్దు చేసుకోవాలని సూచించింది.
ఇదే క్రమంలో కరోనా పేషెంట్స్ కోసం వికారాబాద్లోని హరితా రిస్టార్స్లో ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేశారు.అలాగే గచ్చిబౌలి స్టేడియంలోనూ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయనున్నారు. నగర శివారులోని దూలపల్లిలోనూ మరో ఆసుపత్రి ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 2,020 పడకలతో ఈ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 114కి చేరింది. సోమవారం నాటికి కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే.. కేరళలో 23, ఉత్తరప్రదేశ్లో 12, హర్యానాలో 14, కర్ణాటకలో 6, ఢిల్లీలో 7, తెలంగాణలో 3, లడఖ్లో 4, జమ్మూ కాశ్మీర్ లో 3, ఆంధ్ర ప్రదేశ్ 1 కేసులు, ఒడిశాలో 1, పంజాబ్లో 1, రాజస్థాన్లో 2, తమిళనాడులో 1, ఉత్తరాఖండ్లో 1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 17 మంది విదేశీయులే.