ప్రాజెక్టుల సెగ: 'హైదరాబాద్లో బాబు, మంత్రుల ఇంటికి నీళ్లు కట్ చేయాలి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి, డిండి, మేడిగడ్డ తదితర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని, ఈ ప్రయత్నాలను ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఓయూ జేఏసీ మంగళవారం మండిపడింది.
కేసీఆర్ భగీరథ ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం హర్షిస్తోందని వారు అన్నారు. వీటిని ఓర్వలేక ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గం తెలంగాణ ప్రాజెక్టులు అక్రమమని, వాటిని నిలిపివేయాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రివర్గ తీర్మానం చేయడం అమానుషమన్నారు.
ఇది అమానవీయ చర్య అన్నారు. తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు నీటిని అడ్డుకుంటున్న చంద్రబాబు, ఆయన మంత్రులకు తెలంగాణ నీళ్లు తాగే హక్కు లేదని ధ్వజమెత్తారు. హైదరాబాదులోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రుల నివాసాలకు నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు వారు జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. వారికి నీరు, విద్యుత్ నిలిపివేయడంతో పాటు జీహెచ్ఎంసీ నుంచి అందుతున్న అన్ని సదుపాయాలను ఆపేయాలని కోరారు.
రైతాంగానికి నీళ్లు రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు కుటుంబానికి, ఆయన మంత్రివర్గానికి హైదరాబాద్ నీళ్లు తాగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ రైతుల కన్నీళ్లు తాగి, రాజకీయ దాహం తీర్చుకునే కుట్రలు చేయడం చంద్రబాబుకు తగదని హితవు పలికారు.
పాత ప్రాజెక్టులను రీడిజైన్ చేయడంవలన తెలంగాణలో అదనంగా 11.15 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని చెప్పారు. దీనిని ఓర్వలేక ఏపీ మంత్రివర్గం తీర్మానాలు చేస్తోందన్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ టీడీపీ నేతలు తమ పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేయకపోవడం ఏమిటన్నారు. టీడీపీ జెండా గద్దెలను కూల్చి, తెలంగాణ టీడీపీ నాయకులపై భౌతిక దాడులు చేసే రోజులు త్వరలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డారు.