హైదరాబాద్ లో ఈ సాయంత్రం పవన్ ప్రెస్ మీట్- అసలు విషయాలన్నీ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు హైదరాబాద్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన అనంతరం అనూహ్య పరిణామాలు తలెత్తుతున్నాయి. జనసేన సాధకుల సమావేశానికి అనుమతి నిరాకరించడానికి పోలీసులు చూపిన కారణాలను జనసేన అంగీకరించట్లేదు. వాస్తవ ఆందోళనల కంటే సాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఇవి సమాధానాల కన్నా అనేక ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయని జనసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఒక విశ్లేషకుడి నిరాధార వ్యాఖ్యలు, వాటికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతివాదనలు ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా శాంతిభద్రతలకు ఎలా ముప్పుగా మారతాయని జనసేన ప్రశ్నిస్తోంది. నవ నిర్మాత సంకల్ప సభను అడ్డుకోవడానికి ఇదొక బలహీనమైన సాకుగా ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. తనపై నిరాధార ఆరోపణలు చేస్తోన్నారని, వాటికి స్పందించడం వల్ల ఉద్రిక్తతలు పెరుగుతాయనేది అసలు ప్రశ్నగా మారిందని చెబుతోంది.

తెలంగాణ ప్రభుత్వం తొందరపాటుతో వ్యవహరించిందని, అస్పష్టమైన శాంతిభద్రతల సమస్యలు, పార్కింగ్ ఇబ్బందులను సాకులుగా చూపించిందని జనసేన ఆరోపించింది. పవన్ కళ్యాణ్ కొండగట్టు అభివృద్ధికి మద్దతు ఇచ్చి, తన వ్యక్తిగత నిధుల నుండి కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినప్పుడు, ఎవరూ ఆయన ప్రాంతాన్ని ప్రశ్నించలేదని, పార్టీ పుట్టిన గడ్డ అయిన తెలంగాణకు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆయన వస్తే అకస్మాత్తుగా ప్రాంతీయ సెంటిమెంట్లు ఎందుకు గుర్తొచ్చాయని జనసేన వాదిస్తోంది.
మొన్నటికి మొన్న పెద్ద ఎత్తున జరిగిన ఓ మతపరమైన సభలకు అనుమతులు మంజూరు చేశారని జనసేన గుర్తు చేసింది. అప్పుడు పార్కింగ్ సమస్య ఎందుకు తలెత్తలేదని ప్రశ్నిస్తోంది. గతంలో ఇదే వేదికపై 2,000 మందికి పైగా హాజరైన కార్పొరేట్ ఈవెంట్లకు సైతం అనుమతులు ఇచ్చారని పేర్కొంటోంది. ఆ కార్యక్రమాలకు పార్కింగ్ సమస్య లేనప్పుడు, జనసేన సభకు మాత్రం అది ఒక్కసారిగా సమస్యగా ఎలా మారిందని జనసేన వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య పవన్ కల్యాణ్ నేడు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఈ సాయంత్రం 4:30 నుంచి 5:30 మధ్యలో ఇది ఏర్పాటైంది. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు. జనసేన పార్టీ నేతలతో కలిసి, తన ఇంట్లో కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికైనా పోలీసులు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది.
కోడి చెరువు కబ్జా వ్యవహారం మొదలుకుని, సోమాజీగూడ ప్రెస్ మీట్ లో చోటు చేసుకున్న గొడవలు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల వరకు ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలన్నింటిపైనా పవన్ మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించడానికి అవసరమైన రోడ్ మ్యాప్ ను సైతం పవన్ వెల్లడిస్తారని అంటున్నారు. ఏపీతో పాటు తెలంగాణ రాజకీయాలపైనా దృష్టి సారిస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications