నన్ను చల్లగా చూడు: కొండగట్టుకు పవన్ 11 లక్షల విరాళం, కారెక్కిన ఫ్యాన్స్, భార్య పనికి నవ్వుకున్నాడు
Recommended Video
హైదరాబాద్: సోమవారం ఉదయం తన నివాసం నుంచి బయల్దేరిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 1.20నిమిషాలకు కొండగట్టుకు చేరుకున్నారు. పూజలు చేశారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. స్వామి నన్న చల్లగా చూడాలని కోరుకున్నానని చెప్పారు.
అంజనేయుడి అనుగ్రహంతోనే తాను పార్టీ స్థాపించానని చెప్పారు. ఈ స్వామి ఆశీస్సులతో 2009లో బతికిబట్ట కట్టానని చెప్పారు. ఈ సందర్భంగా కొండగట్టు అంజన్న గుడికి పవన్ రూ.11 లక్షల విరాళం ఇచ్చారు. అంతకుముందు ఆయన, సోమవారం ఉదయం హైదరాబాదులోని తన ఇంటి నుంచి జనసేన పార్టీ కార్యాలయం నుంచి కొండగట్టుకు బయలుదేరారు. బయలుదేరేముందు భార్య లెజినోవా ఎదురొచ్చి హారతి ఇచ్చారు. ఆమె భర్తకు తిలకం దిద్దారు.
పవన్ కళ్యాణ్ కరీంనగర్లో అభిమానులు, జనసేన నాయకులతో భేటీ కానున్నారు.
కొండగట్టుకు పవన్, ఫ్యాన్స్ ఉత్సాహం, వారిని ఆపేశారు
పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం గం.1.20 నిమిషాల మధ్య కొండగట్టు చేరుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓకారు పైకి ఎక్కిన ఇద్దరు యువకులు పవన్ వైపు చూస్తూ చేతులు ఊపే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతం అంతా జై పవన్ కళ్యాణ్, జై జనసేన అనే నినాదాలతో హోరెత్తిపోయింది. అభిమానులను పోలీసులు అదుపు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో పోలీసులు వారిని ఆలయ కమాన్ వద్ద ఆపేశారు.
చూపుడు వేలితో కుంకుమ పెట్టబోగా, కొబ్బరికాయ పగలక పవన్ నవ్వులు
పవన్ సతీమణి లెజినోవా లైట్ మెరూన్ రంగు చీరలో మెరిసిపోయారు. ఆమె చూపుడు వేలితో కుంకుమను తీసుకుంది. ఆమెకు మన సంప్రదాయం తెలియదు. దీంతో వెంటనే పవన్ నవ్వుకొని, ఆ వేలితో కాదని, కుడిచేయి ఉంగరం వేలితో బొట్టు పెట్టాలని సూచించారు. భర్త చెప్పినట్లుగా ఆమె చేసింది. ఆ తర్వాత కారు ఎదుట కొబ్బరికాయ కొట్టారు లెజినోవా. ఆ కొబ్బరికాయ పగలకపోవడంతో పవన్ నవ్వుకున్నారు. మళ్లీ కొట్టాలని సూచించడంతో ఆమె మరోసారి కొబ్బరికాయ కొట్టింది. దీంతో అది పగిలింది.
హైదరాబాద్ శివారుకు వెళ్లేసరికి పెరిగిన కాన్వాయ్
సికింద్రాబాద్, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట మీదుగా కొండగట్టుకు 50 కాన్వాయ్లతో బయలుదేరారు. ఆయన వెంట అభిమానులు పెద్దఎత్తున తరలి వచ్చారు. జనసేన కార్యాలయం నుంచి 50 కార్లతో పవన్ కాన్వాయ్ బయలుదేరింది. హైదరాబాద్ శివారుల్లోకి వెళ్లేసరికి ఆ కాన్వాయ్ అనూహ్యంగా 150కి పైగా చేరుకుంది. అభిమానులు కనిపించిన చోట పవన్ కళ్యాణ్ కారును ా ఆపి పలకరించడం లేదా చేతులు ఊపడం చేస్తున్నారు.
తరలి వస్తున్న అభిమానులు
పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన నేపథ్యంలో జనసేన కార్యాలయానికి, కొండగట్టుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయనను చూసేందుకు కూడా అభిమానులు, జనాలు కదిలారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
పొన్నం హెచ్చరిక
ఇప్పటికే, కాంగ్రెస్ పార్టీ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జనసేనానికి హెచ్చరికలు జారీ చేశారు. పవన్ కొండగట్టు పర్యటన అడ్డుకుంటామని చెప్పారు. కొండగట్టుకు పవన్ రావడం తమకు అభ్యంతరం లేదని, కానీ గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కాబట్టి కొండగట్టును సందర్శించే అర్హత లేదన్నారు.
రెండు రోజుల పాటు కరీంనగర్ జిల్లాలో
కాగా, పవన్ రెండు రోజుల పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 11.30 గంటలకు అల్గునూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ద్విచక్ర వాహనాల, కార్లతో స్వాగతం పలికి ర్యాలీగా 12:30 గంటల వరకు రేకుర్తికి వెళ్తారు. అక్కడి నుంచి కేవలం కార్ల కాన్వాయ్ మాత్రం పవన్తో మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకుంటుంది.
హోటల్లో బస
అక్కడ ఆంజనేయస్వామి దర్శనం అనంతరం పార్టీ విధివిధానాలను ప్రకటిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు కొండగట్టు నుంచి కరీంనగర్కు వచ్చి రాత్రి హోటల్లో బస చేస్తారు. మంగళవారం రేకుర్తిలోని ఓ కళ్యాణ మంటపంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు.