సీఎం అహంకారాన్ని అణచేందుకు ప్రజలు రెడీ.!వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటమి తప్పదన్న ఈటల.!
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికిన ముదిరాజ్ మహాసభ నాయకులు మరియు అభిమానులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ ప్రసంగించారు. హుజూరాబాద్ ఎన్నికల తరువాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు సంఘటితమై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తున్నారని అన్నారు. చంద్రశేఖర్ రావు పూటకు ఒకమాట మాట్లాడటం, ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కే పరిమితం కావడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఈటల తెలిపారు. నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఉద్యోగాల కోసం వయోపరిమితి దాటిపోతున్నా నియామకాలు మాత్రం చేపట్టడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో ఒక లక్షా తొంబై వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తెలిసి కూడా చంద్రశేఖర్ రావు నియామకాలు చేపట్టడం లేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, ఉద్యోగాలు రాక, ఉపాధి లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని, స్వయంగా చెప్పిన చంద్రశేఖర్ రావు ఇప్పుడు రైతు గోసకు కారణమవుతున్నాడని ధ్వజమెత్తారు. కల్లాల్లో వరి కుప్పలా మీదనే రైతులు తనువు చాలిస్తున్నారని, వారి బాధలు పట్టించుకోకుండా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ గమనించిన ప్రజలు కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా చంద్రశేఖర్ రావు అహంకార పోకడలకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దమవుతున్నారని అన్నారు. చంద్రశేఖర్ రావు కు ప్రత్యామ్నాయం బీజేపీ అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని, చంద్రశేఖర్ రావుకు ధీటైన సమాదానం చెప్పడం ఒక్క బీజేపికి మాత్రమే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రశేఖర్ రావుకు బుద్ది చెప్పడనికి తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారని ఈటల రాజేందర్ స్పష్టం చేసారు.