హైదరాబాద్ నరకం: వీడని జలచెర, వాన భయం అలాగే... (పిక్చర్స్)
హైదరాబాద్ : హైదరాబాదు నగరానికి జలచెర వీడేట్లు లేదు. మరిన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉండవచ్చునని, వర్షాలు మరిన్ని రోజులు పడవచ్చునని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నాలుగు రోజులుగా హైదరాబాదులో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాదులోని చెరువులు ప్రమాదకరంగా పరిణమించాయి.
ఫోటో గ్యాలరీ : హైదరాబాద్ జలమయం
చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భవనాల సెల్లార్లలో నీరు నిండి ఉంది. హుస్సేన్ సాగర్ కూడా పూర్తిస్థాయి నీటి నిల్వను దాటింది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
శుక్రవారం ఉదయం వాన తెరిపినిచ్చినా రాత్రి మళ్లీ కురిసింది. శనివారం నాడు కూడా కొన్ని ప్రాంతాల్లో ముసురు, మరి కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. శుక్రవారం రాత్రి మళ్లీ వివిధ ప్రాంతాల్లో ఒకటి నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వర్షం పడుతూనే ఉంది...
కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాలానగర్, జీడిమెట్ల, చింతల్, అల్వాల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా షాపూర్ నగర్లో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్కాజ్గిరిలో 2.9 సెం.మీలు, బాలానగర్లో 1.9; బొల్లారం 1.5; తిరుమలగిరి 1.4; మారేడ్పల్లిలో 1.3 సెం.మీలు కురిసింది.

ఇంకా నాలుగైదు రోజులు తప్పదు
మరో నాలుగైదు రోజులు హైదరాబాదులో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో హుస్సేన్ సాగర్ పరీవాహకంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు జాగారం చేశారు. 2000 సంవత్సరంలో వచ్చిన వరదలతో పరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీటితోపాటు పాములు, తేళ్లు, ఇతర విష పురుగులు చేరాయి. ఆ పరిస్థితి మళ్లీ వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు

హెలికాప్టర్లను సిద్దంగా ఉంచామని కెటిఆర్
విపత్తు సంభవిస్తే సమర్థంగా ఎదుర్కొనేందుకు రెండు హెలికాప్టర్లను ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందని మంత్రి కెటి రామారావు తెలిపారు. శుక్రవారం రాత్రి కూడా మేయర్, కమిషనర్ కంట్రోల్ రూమ్ నుంచే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్లో ఆర్మీ లైజనింగ్ ఆఫీసర్ అందుబాటులో ఉన్నారు. ఎక్కడ సేవలు అవసరమైనా సమాచారం ఇచ్చిన అరగంటలో వస్తామని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే కాప్రా, షేక్పేట ప్రాంతాల్లో బస చేశాయి.

రంగంలోకి దిగిన సైన్యం
హైదరాబాదులోని లంగర్హౌస్, హకీంపేటల్లో సైన్యం సిద్ధంగా ఉంది. శుక్రవారం రాత్రి నిజాంపేటలోని భండారి లే అవుట్ ప్రాంతాన్ని సైన్యం పరిశీలించింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు నాయిని, కేటీఆర్, మేయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్దన్రెడ్డిలు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షించారు.

నాలుగు రోజుల నుంచి నరకమే..
తాగేందుకు నీళ్లు లేక, తినేందుకు తిండి లేక, బయటకు వెళ్లేందుకు దారి లేక హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కట్లను చవి చూస్తున్నారు.నీట మునిగిన ప్రాంతాలకు బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో, హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు దిక్కు తోచని పరిస్థితిలో పడ్డారు.

అపార్టుమెంట్ల సెల్లార్లు చెరువులే
అపార్ట్మెంట్ల సెల్లార్లు కూడా చెరువులా మారడంతో కిందకు దిగే పరిస్థితి లేదు. నిజాంపేటలోని బండారి లే అవుట్ మూడో రోజూ నీటిలోనే ఉంది. ఎగువన ఉన్న తుర్క చెరువు అలుగు, తూములు మూయడంతో తాత్కాలికంగా వరద ప్రవాహం తగ్గినా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

బస్తీలు నీట మునిగాయి...
ముషీరాబాద్, సికింద్రాబాద్, ఉప్పల్, మల్కాజ్గిరి నియోజకవర్గాల పరిధిలో పలు బస్తీలు నీట మునిగాయి. అత్యధిక ప్రాంతాల్లో ప్రజలకు నిద్ర కరువైంది. సఫిల్గూడ, బండ చెరువులు పూర్తిగా నిండి తూముల ద్వారా బయటకు వచ్చిన వరద నీరు నాలాల వెంట మహోగ్రంగా రావడంతో ఆ ఉద్ధృతికి పలు కాలనీల్లో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.

జలదిగ్భంధం, ఆహారం పొట్లాలు....
మెహదీపట్నంలోని నిజాం కాలనీ, జమాలి కుంట జల దిగ్బంధమయ్యాయి. జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలు, ప్రైవేట్ వ్యక్తులు బాధితులకు ఆహార ప్యాకెట్లు, నీళ్లు అందజేశారు. తాము ఇంకా నీళ్లలోనే ఉన్నామని మౌలాలి, అల్వాల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లోని పలు బస్తీలు, కాలనీవాసులు మండిపడ్డారు.

సహాయక చర్యలు ఇలా..
శుక్రవారం వర్షం కాస్త తెరిపినివ్వడంతో ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగం అందుకున్నాయి. ఎల్బీనగర్, ఉప్పల్; మల్కాజ్గిరి, కుత్బుల్లాపుర్, కూకట్పల్లి సర్కిళ్లలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నీట మునిగిన ప్రాంతాల ప్రజలకు ఆహార ప్యాకెట్లు, తాగునీరు ఉచితంగా అందజేశారు. కాప్రా చెరువు నుంచి వరద పొంగి పొర్లుతుండడంతో వీఎన్ రెడ్డి నగర్ కాలనీలోని 15 కుటుంబాలను కుషాయిగూడలోని పునరావాస కేంద్రానికి తరలించారు.

ఆర్మీ రంగంలోకి దిగింది..
హైదరాబాద్ లో వరద బాధితులకు సహాయ చర్యల కోసం ఆర్మీ బృందాలు శనివారం ఉదయం రంగంలోకి దిగాయి. కల్నల్ దేశ్పాండే ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అల్వాల్, నిజాంపేట్, బేగంపేట్, పాటిగడ్డ, ప్రకాష్నగర్, ఆల్మిన్కాలనీ, రాజ్భవన్ రోడ్డు ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాయి.

నీట మునిగిన పాఠశాల
భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే ఆల్విన్కాలనీ ధరణీనగర్లో ఓ స్కూల్ బస్సు శనివారం ఉదయం వరద నీటిలో చిక్కుకుంది. స్థానికుల అప్రమత్తతతో 40 మంది విద్యార్థులకు ముప్పు తప్పింది. స్థానికులందరూ కలిసి బస్సును బయటకు తీశారు. వరద నీటిలో బస్సును తీసుకెళ్లిన డ్రైవర్పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించినప్పటికీ నగరంలోని పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications