ఫిబ్రవరి 5న నాందేడ్లో బీఆర్ఎస్ సభ: ఈసారి గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహం ఇదే!!
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమితిని విస్తరించడానికి, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రజల మద్దతును సంపాదించడానికి ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మొన్నటికి మొన్న ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కాగా, తాజాగా మరో సభను నిర్వహించడానికి కెసిఆర్ సన్నాహాలు చేస్తున్నారు.

నాందేడ్ లో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్
జాతీయ రాజకీయాల దృష్టిని మరింతగా ఆకర్షించడమే లక్ష్యంగా మహారాష్ట్రలోని నాందేడ్ లో సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 5వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే నాందేడ్ లో సభ నిర్వహించడం కోసం కేసీఆర్ సభకు అవసరమైన ఏర్పాట్లను చేయడం కోసం మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలతో ప్రగతిభవన్ లో మూడు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో సభ విజయవంతం కావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలుస్తుంది.

మహా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నాందేడ్ లో సభ
నాందేడ్ లో బిఆర్ఎస్ బహిరంగ సభని ఈనెల 29వ తేదీన నిర్వహించాలని ముందు నిర్ణయించినప్పటికీ అక్కడ ఎన్నికల కారణంగా తేదీని మార్చుకోవాల్సి వచ్చింది. అక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఫిబ్రవరి 5వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నట్టు తెలుస్తుంది. మహారాష్ట్ర శాసనమండలిలో రెండు పట్టభద్రులు, మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ఫిబ్రవరి 2వ తేదీన ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇక ఆపై ఫిబ్రవరి 5వ తేదీన బిఆర్ఎస్ సభ నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందని భావించి ఆ డేట్ ఫిక్స్ చేసినట్లుగా సమాచారం.

జాతీయ రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించేలా నాందేడ్ సభ
అయితే తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ సమావేశాలకు 4, 5 తేదీల్లో విరామం ఉంది. దీంతో ఐదవ తేదీన నాందేడ్ లో సభ నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఖమ్మం సభ తరహాలో నాందేడు సభలో కూడా జాతీయ రాజకీయాలను ఆకర్షించే దిశగా సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి కీలక నాయకులను సభకు ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సభ వేదికగా మహారాష్ట్రకు చెందిన ముఖ్య నేతలు బిఆర్ఎస్ లో చేరనున్నారని బిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

నాందేడ్ సభకు కీలక బాధ్యతలు వారికే.. జనసమీకరణకు ప్లాన్
ఇక సభ ఏర్పాట్లు, సభకు ఆహ్వానితులు తదితర వివరాలను మరో ఒకటి రెండు రోజుల్లో ఫైనల్ చేసే పనిలో ఉన్నారు సీఎం కేసీఆర్. నాందేడ్ లో నిర్వహించ తలపెట్టిన సభకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పలువురు మంత్రులకు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. పొరుగు రాష్ట్రంలో నిర్వహిస్తున్న సభ కావడంతో సభను సక్సెస్ చేయడం కోసం భారీగా ఏర్పాట్లు చేయాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర నేతలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న తదితరులకు అప్పగించునున్నట్టు సమాచారం. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి కూడా నాందేడ్ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications