హైద్రాబాద్ మెట్రోని త్వరగా పూర్తి చేయండి: మోడీ, 30 లక్షల ఉద్యోగాలు సృష్టించేలా..
న్యూఢిల్లీ: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారులకు సూచించారు. ప్రగతి సమీక్షా సమావేశంలో ఆయన వివిధ రాష్ట్రాలలోని ముఖ్యమైన ప్రాజెక్టుల పురోగతి పైన ఆరా తీశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలు అంశం చర్చకు వచ్చింది.
ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చేపట్టిన ముఖ్య మౌలిక సదుపాయాల ప్రాజకె్టుల పురోగతిని ఆయన సమీక్షించారు. ప్రధాని సమీక్షించిన వాటిలో రైల్వే, మెట్రో రైలు, విద్యుత్తు, ఆహార ప్రాసెసింగ్ రంగాలు ఉన్నాయి.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును వీలైన త్వరగా, ఉత్తమ నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
30 లక్షల ఉద్యోగాలు సృష్టించేలా టఫ్ సవరణకు ఆమోదం
టెక్నాలజీ అప్ గ్రేడేషన్ ఫండ్ (టఫ్) స్కీమ్ సవరణకు మోడీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా టెక్స్టైల్ రంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు కేంద్రం నిధులను అందిస్తుంది. తద్వారా, సుమారు 30 లక్షలకు పైగా ఉద్యోగ సృష్టి జరుగుతుంది.
సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులను సైతం ఈ రంగం ఆకర్షించగలుగుతుంది. మోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో టఫ్ సవరణలకు ఆమోదం తెలిపారు.
టఫ్కు బడ్జెట్లో రూ.17,822 కోట్లు కేటాయించాలని, అందులో రూ.12,671 కోట్లను ఈ రంగంలోని రుణాల మాఫీకి కేటాయించాలని, మిగిలిన మొత్తాన్ని వివిధ సంస్థల్లో టెక్నాలజీ అభివృద్ధికి రుణాల రూపంలో ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications