పోచంపల్లికి అంతర్జాతీయ ఖ్యాతి: అత్యుత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించిన ఐక్యరాజ్యసమితి
యాదాద్రి భువనగిరి: తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఇప్పటికే పోచంపల్లి చీరెలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ గ్రామం.. ఈ దఫా ఏకంగా ఐక్యరాజ్య సమితి దృష్టిలో పడింది. ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా పేరు సాధించింది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైన ఈ పర్యాటక గ్రామాన్ని సందర్శించేంతటి స్థాయికి చేరింది. వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్గా అవార్డును అందుకోనుంది ఈ గ్రామం.
హైదరాబాద్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ విలేజ్. దేశం మెచ్చిన నేత చీరెలకు కేరాఫ్ అడ్రస్. మగ్గంపై నేసిన చేనేత కళాఖండాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. భూదానోద్యమానికి ప్రసిద్ధి చెందింది. అందుకే భూదాన్ పోచంపల్లిగా పిలుస్తుంటారు. అక్కడి చేనేత కార్మికులు నేసిన చీరలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. మొదటగా పేటెంట్ హక్కును పొందడం ఈ గ్రామం ప్రత్యేకత.

ఇప్పుడు తాజాగా ఐక్యరాజ్య సమితి పోచంపల్లిని.. ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితిలో ఓ భాగమైన ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్డబ్ల్యూటీఓ) ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చేనెల 2వ తేదీన స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో జరిగే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సర్వసభ్య సమావేశంలో పోచంపల్లికి అవార్డును అందజేయనుంది ఐక్యరాజ్య సమితి. ప్రపంచ పర్యాటక సంస్థ 24వ సర్వసభ్య సమావేశం ఇది.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఈ అవార్డును అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే తెలంగాణకు చెందిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పోచంపల్లి గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. తన సొంత రాష్ట్రంలోని ఓ గ్రామం.. ప్రపంచంలోనే అత్యుత్తమ టూరిజం విలేజ్గా గుర్తింపు సాధించడం పట్ల కేంద్ర పర్యాటక మంత్రిగా తాను సంతోషిస్తోన్నానని అన్నారు.
పోచంపల్లితో పాటు మేఘాలయాలోని కాంగ్థోంగ్, మధ్యప్రదేశ్లోని లాఢ్పురా ఖాస్ గ్రామాలను వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్గా గుర్తించడానికి ఐక్యరాజ్య సమితికి పంపించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మూడింట్లో పోచంపల్లిని ఎంపిక చేసింది ప్రపంచ పర్యాటక సంస్థ. ఈ మేరకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు అధికారికంగా సమాచారాన్ని అందజేసింది. వచ్చేనెల 2వ తేదీన మ్యాడ్రిడ్లో జరిగే సర్వ సభ్య సమావేశం సందర్భంగా అవార్డును అందుకోవాల్సి ఉంటుందని తెలిపిది.












Click it and Unblock the Notifications