ఏపీ మంత్రుల వ్యాఖ్యలు బాధాకారం: కేసీఆర్తో జగన్ కలిసి సమస్య పరిష్కారించాలన్న పువ్వాడ
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు కారణంగానే ఇటీవల భద్రాచలం వరద ముంపునకు గురైందని, ఆ ప్రాజెక్టుతో భవిష్యత్తులోనూ ముంపు తప్పదన్న తన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు విమర్శలు చేయడంపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రులు తప్పుబట్టడం బాధాకరమని పువ్వాడ అన్నారు.
ఏపీ మంత్రుల వ్యాఖ్యలు అర్ధరహితమన్న పువ్వాడ
తాను మాట్లాడిన దాంట్లో తప్పేముందని మంత్రి పువ్వాడ అజయ్ ప్రశ్నించారు. ప్రజలు, దేవుడు మునగకుండా కరకట్టల నిర్మాణానికి ఐదు గ్రామాలను ఇవ్వాలని కోరుతున్నామన్నారు. తమకు హైదరాబాద్ ను ఇస్తారా? అని మంత్రి బొత్స మాట్లాడటం అసందర్భమని, అర్ధరహితమని మంత్రి పువ్వాడ మండిపడ్డారు.
కేసీఆర్తో జగన్ చర్చించాలి.. ఐదు గ్రామాలు ఇప్పించాలి
భద్రాద్రి రాముడు నీటిలో మునిగిపోతుంటే.. ఏపీ ప్రజలకు కూడా బాధ కలుగుతుందని మంత్రి పువ్వాడ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్తో ఏపీ సీఎం జగన్ చర్చలకు వచ్చేలా మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు కృషి చేయాలన్నారు. భద్రాచలం రాములవారు మునగకుండా చూడాలన్నారు. సీఎం జగన్ తో చర్చించి ఐదు గ్రామాలను ఇప్పించాలని మంత్రి పువ్వాడ కోరారు.
ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపితేనే వరద సమస్యకు పరిష్కారం
ఐదు గ్రామాలను కలిపితేనే భద్రాద్రి రాములోరి దేవస్థానానికి కరకట్ట నిర్మాణం సాధ్యమవుతుందన్నారు మంత్రి పువ్వాడ. భద్రాచలం ముంపు సమస్యకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం సహకరించాలన్నారు. సున్నితమైన అంశాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవాలన్నారు. బేషజాలకు పోకుండా.. వరద సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ముందుకు రావాలని మంత్రి పువ్వాడ అజయ్ పిలుపునిచ్చారు. ఇది రెండు రాష్ట్రాల ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ ఏమన్నారంటే..?
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముంపు ప్రమాదం పొంచివుందని, అందుకే ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. పోలవరం పూర్తయితే భద్రాచలం వద్ద 45 అడుగుల వరద ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసిన ఏడు మండలాలు, భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలూ తెలంగాణలో కలపాలని మంత్రి డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లు పెట్టి ఐదు గ్రామాలను తెలంగాణ విలీనం చేయాలని కోరారు. పోలవరం ఎత్తు తగ్గించాలని చాలా సార్లు కోరామని చెప్పారు. అయితే, మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. తాము అడిగితే హైదరాబాద్ను ఏపీలో కలుపుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణను, ఏపీని మళ్లీ కలిపినా తమకు అభ్యంతరం లేదని అన్నారు.