ఫిలింనగర్ హనుమాన్ టెంపుల్ వివాదం-హిందూ సంఘాల నిరసన-150 మంది అరెస్ట్,అసలెందుకీ వివాదం..
హైదరాబాద్లోని ఫిలింనగర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రామానాయుడు స్టూడియో సమీపంలోని గుట్టపై హనుమాన్ విగ్రహాన్ని తొలగించడంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తొలగించిన విగ్రహాన్ని తిరిగి అక్కడ ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. హిందూ సంఘాల ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని... వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం,తోపులాట చోటు చేసుకున్నాయి.

హిందూ సంఘాల నిరసనతో ఉద్రిక్తత...
బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,పలువురు బీజేపీ కార్యకర్తలు,స్వామిజీలు,హిందూ సంఘాల ప్రతినిధులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరంతా హనుమాన్ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో...
అది ప్రైవేట్ ప్రాపర్టీలో ఉందంటూ పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేగింది. పోలీసులు దాదాపు 150 మందిని అరెస్ట్ చేసి... వారిని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా హిందూ సంఘానికి చెందిన ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు తమను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇది అత్యంత బాధాకరమని... ఫిలింనగర్ ఏమైనా పాకిస్తాన్లో ఉందా అని ప్రశ్నించారు. తాము హనుమాన్ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు.

గతంలో రాజాసింగ్ హెచ్చరిక...
ఫిలింనగర్లోని హనుమాన్ ఆలయంపై చాలాకాలంగా వివాదం నెలకొంది. గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బీజేపీ కార్యకర్తలతో కలిసి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆలయాన్ని కూల్చివేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా ఓ ప్రైవేట్ సంస్థ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అసలేంటీ వివాదం
2007లో వైఎస్ హయాంలో..ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించిన సంగతి తెలిసిందే.డెక్కన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏజెన్సీ ద్వారా ఈ ప్రక్రియ జరిగింది.
ఇందులో భాగంగా బాచుపల్లిలోని 90 ఎకరాల భూమిని ఇందూ ప్రాజెక్ట్ సంస్థ కొనుగోలు చేసింది. ఒక్కో ఎకరం రూ.4 కోట్ల చొప్పున రూ.369 కోట్లకు విక్రయం జరిగింది.ఇందులో రూ.200 కోట్లు ఇందూ సంస్థ ప్రభుత్వానికి చెల్లించింది. తర్వాత కొందరు ఆ భూములు తమవంటూ కోర్టుకెక్కారు. దీంతో రిజిస్ట్రేషన్స్ జరగలేదు.దీనిపై ఇందూ సంస్థ కోర్టుకెక్కింది. ఆలస్యమైనా సరే తమకు మరో చోట భూమిని కేటాయించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీంతో ఇందూ సంస్థ చెల్లించిన రూ.200 కోట్లకు సమాన విలువ చేసే భూమిని మరో చోట కేటాయించాలని ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చింది.
Recommended Video

రాజీ కుదిర్చే ప్రయత్నం జరిగినా...
కోర్టు ఆదేశాల మేరకు.. ఇందూ ప్రాజెక్ట్కు చెందిన మరో సంస్థ రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్కి ఫిలింనగర్ లోని సర్వే నెంబర్ 403లో కొండ ప్రాంతమైన షేక్ పేట నాలా, రామానాయుడు స్టూడియో నుంచి ఓల్డ్ ముంబై హైవేకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో 10 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 1ని విడుదల చేసింది. అయితే ఇందూ సంస్థ చెల్లించిన మొత్తం కంటే ఈ భూమి విలువ ఇంకా ఎక్కువనే వాదనలు ఉన్నాయి. ఈ స్థలాన్ని దక్కించుకున్న రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ చుట్టూ పెద్ద రేకులతో ప్రహారీ నిర్మించింది. అయితే ఇదే స్థలంలో చాలాకాలంగా తాము ఆంజనేయుడికి ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడది ప్రైవేట్ సంస్థ చేతిలోకి వెళ్లడంతో లోపలికి ఇతరులను అనుమతించట్లేదు. ఆలయానికి 200గజాల స్థలం ఇస్తామని ఆ సంస్థ యజమానులు రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే దారి లేకుండా కేవలం ఆలయ నిర్మాణానికి స్థలం ఇస్తే ఎలా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ,హిందూ సంఘాల కార్యకర్తలు అక్కడ నిరసనకు దిగారు.












Click it and Unblock the Notifications