కెటిఆర్ ఇలాకాలో మరో ఘోరం: భర్తను చంపేశారు, భార్యను మాయం చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు కుమారుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఇలాకాలో మరో ఘోరం వెలుగు చూసింది.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు కుమారుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఇలాకాలో మరో ఘోరం వెలుగు చూసింది. నేరెళ్ల ఘటనను మరిచిపోక ముందే మరో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వార్తాకథనాన్ని నవ తెలంగాణ దినపత్రిక ప్రచురించింది.
నవ తెలంగాణ కథనం ప్రకారం... ఓ దళితుడు పోలీసుల దాష్టీకానికి బలయ్యాడు. తన భర్తను తనకు కాకుండా చేశారని రోడ్డుకెక్కిన భార్యను భయాందోళనకు గురి చేసి కనిపించకుండా చేశారు. చిల్లరదొంగ, జేబుదొంగ అనే ఆరోపణలతో దళిత యువకుడు కడమంచి వెంకటేష్ను మంత్రి కేటీఆర్ సభలోనే పోలీసులు అరెస్టు చేశారు.
వారం రోజులపాటు అతడ్ని పోలీసుస్టేషన్లో ఉంచి విచారించారు. చివరకు నేరం చేశాడో తెలియదు గానీ అతను నేరాన్ని అంగీకరించాడు. అతడిపై జేబు దొంగతనం కేసు పెట్టని ఖాకీలు అంతరాష్ట్ర జిల్లా దొంగ అని కేసు నమోదు చేశారు. నవ తెలంగాణ వార్తాకథనం ఇలా సాగింది.

ఇలా చెప్పుకున్నాడు...
చిత్ర హింసలకు గురైన వెంకటేష్ జైలులో ఉన్న సమయంలో నేరెళ్ల బాధితులతో తన జరిగిన అన్యాయం, పోలీసులు పెట్టిన చిత్రహింసల గురించి వారికి చెప్పాడు. లాఠీ దెబ్బలకు లోపల అవయవాలు దెబ్బతిని, మర్మాంగాల నుంచి రక్తం కారినట్టు చెప్పారు. అరికాళ్లు, పిక్కలపై కొట్టడంతో కాళ్లు పలిగి రక్తం కారింది. దీంతో ఆయన జైల్లో చలి జర్వంతో వణికిపోయారని నేరెళ్లబాధితులు తమతో చెప్పినట్లు నవ తెలంగాణ రాసింది.

ఇలా మొదలైంది...
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జులై 5వ తేదీన కేటీఆర్ పాల్గొన్న సభలో దొంగతనం జరిగింది. దీంతో వేములవాడ సాయినగర్కు చెందిన దళిత (ఎస్సీ బుడగ జంగం) యువకుడు కడమంచి వెంకటేష్ను ఎల్లారెడ్డి పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.60 వేల దొంగతనం జరిగిందని ఓ టీఆర్ఎస్ నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే ఒకరిని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న వెంకటేష్ను అంతరాష్ట్ర దొంగతనం కేసులో జూలై 13న అరెస్టు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. జేబుదొంగను అరెస్టు చేసినట్టుగా జూలై 6న మీడియాలో వచ్చింది. ఆ తర్వాత 13న రిమాండ్కు తరలించారు.

జైలుకు వెళ్లిన తర్వాత.
జైలుకు వెళ్లిన తర్వాత వెంకటేష్ అనారోగ్యం పాలయ్యాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 3న రాత్రి మరణించాడు. అయితే రూ. 60 వేల దొంగతనం జరిగితే అతడి నుండి డబ్బులు తీసుకుని రికవరీ చేసినట్టుగా పోలీసులు ఎక్కడా చూపలేదు. తన భర్త జాడ చెప్పమంటూ వెంకటేష్ భార్య వేడుకున్నా పోలీసులు దయచూపలేదు. నిరహార దీక్ష చేపట్టింది. ఆ తర్వాత ఆమె కూడా కనిపించడం లేదు.

భార్య రేణుక దీక్ష.. ఆ తర్వాత అదృశ్యం
భర్త పోలీసుస్టేషన్లో ఉండగా తన భర్తను చూపించాలంటూ చంటిపిల్లాడిని వెంట తీసుకుని రేణుక ఎల్లారెడ్డిపేట పోలీసుస్టేషన్కు వెళ్లి వేడుకుంది. అడిగితే.. ఇక్కడ లేడు అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆ తర్వాత భర్త మరణించాడని తెలియడంతో తట్టుకోలేక భార్య రేణుక దీక్ష చేపట్టింది. తన భర్తను పోలీసులు అత్యంత దారుణంగా కొట్టి చంపారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దీక్ష చేసింది. ఈ దీక్షలతో దళిత యువకుడిని పోలీసులు అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన విషయం వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఆమెను ఇక్కడి నుంచి తప్పించినట్టు తెలుస్తోంది.

కొట్టలేదు...విచారించాం
''కడమంచి వెంకటేశ్ను కొట్టలేదు..విచారణ జరిపి అంతరాష్ట్ర జిల్లా దొంగగా తేల్చాం. 20 రోజులపాటు జైలులో ఉన్నాడు. వైద్యం అందక మరణించి ఉంటాడు. ఒకవేళ మేమే కొట్టినట్టయితే గాయాలతోఉన్న వ్యక్తిని జైలర్ తిప్పి పంపిస్తాడు. కానీ అలా జరగలేదు. ఆయన చనిపోవడానికి మాకు సంబంధం లేదు. ఆయనపై చేయి కూడా చేసుకోలేదు'' అని ఎల్లారెడ్డిపేట ఎస్సై శ్రీనివాసగౌడ్ అంటున్నారు.

చర్యలు తీసుకోవాలి
''కడమంచి వెంకటేష్ మృతికి కారకులైన ఎస్సై, సీఐపై చట్టపరమైన చర్యలు తీసు కోవాలి. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి'' అని ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
''రాష్ట్ర మంత్రి కేటీఆర్ అండతోనే దళితులపై దాడులు జరుగుతున్నాయి. నేరెళ్ల ఘటనగానీ, ఎల్లారెడ్డిపేట ఘటనగానీ మంత్రి అండదండలతోనే జరిగాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మంత్రి తగిన చర్యలు తీసుకోవాలి. పోలీసుల దెబ్బలకు చనిపోయిన వెంకటేష్ కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయాలి'' అని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి పంతం రవి అన్నారు.












Click it and Unblock the Notifications