సారిక, పిల్లల అనుమానాస్పద మృతి: ముందస్తు బెయిల్కు సనా యత్నం?
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు రాజయ్య కోడలు సారిక, మనవళ్ల మృతికి పరోక్షంగా కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్న అనిల్ ప్రియురాలు సనా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సంఘటన జరిగిన ఉదయమే తన సోదరుడితో కలిసి సనా ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
ఆమె కోసం హైదరాబాద్ నగరమంతా గాలిస్తున్నారు. అయితే సనా పోలీసులకు చిక్కకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సనాను అరెస్టు చేయాలని పోలీసులు పట్టుదలతో వున్నారు.
సనా, అనిల్కు సంబంధించిన ఫోటో ఒకటి శుక్రవారం మీడియాలో హల్ చల్ చేసింది. ఈ ఫొటోలో ఇద్దరి మధ్య ఓ చిన్నారి వున్నాడు. అతడు సనా, అనిల్ల కుమారుడు కావచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అనిల్, సనా పెళ్లి చేసుకున్నారా? సహజీవనం చేస్తున్నారా? అనేది తెలియాల్సి వుంది.
కాగా, సారిక మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని విశ్వకర్మ హక్కుల సాధన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మారోజు సోమాచారి, రజకసత్తా రాష్ట్ర అధ్యక్షుడు మన్నారం నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం హిమాయత్నగర్లోని బీసీ సాధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
రాజయ్య కుటుంబంపై సారిక గతంలో ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎంపీ రాజయ్య అతడి కుమారుడు అనిల్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
సారిక మరణంపై ప్రభుత్వం నిజాలను ప్రజలకు తెలియజేయాలని, ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు ఇంద్రవెల్లి రమేశ్, శ్రీనాథ్, శ్రీనివాసాచారి, శ్రీనివాస్ గౌడ్, సాయిప్రసాద్ పాల్గొన్నారు.