కెసిఆర్కు రోజులు దగ్గర పడ్డాయి: పొన్నాల, కొడ్తారని
హైదరాబాద్: కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా ఇవ్వడంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్రంగా విఫలమయ్యారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. శనివారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ.. రైతుల పట్ల కెసిఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.
కెసిఆర్కు రోజులు దగ్గర పడ్డాయని, తెలంగాణ ప్రజలు భౌతికదాడులకు దిగే పరిస్థితి వచ్చిందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కెసిఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. దళితులు, మహిళలను కించపరిచేలా కెసిఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఎవరికి పడితే వాళ్లకు కోట్ల రూపాయలు ఇస్తున్న కెసిఆర్ అమరవీరుల కుటుంబాలను ఇంత వరకు ఆదుకోలేదని ఆరోపించారు. రైతులకు కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వందరోజుల కెసిఆర్ పాలనలో 174 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థులు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచారని పొన్నాల ఆరోపించారు. వేలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థుల జీవితాలతో కెసిఆర్ ఆడుకుంటున్నారని పొన్నాల ధ్వజమెత్తారు. సర్పంచ్లను తొలగించే హక్కు కెసిఆర్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.