ప్రత్యూష ప్రేమ కథ ఇలా మొదలైంది!: పెళ్లిపై కెసిఆర్దే తుది నిర్ణయం
హైదరాబాద్/కర్నూలు: తండ్రి, పినతల్లి చేతుల్లో తీవ్ర చిత్ర హింసలకు గురై, ఆపై స్వచ్ఛంద సంస్థల చొరవతో ఆస్పత్రిలో చేరి తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్వయంగా దత్తత తీసుకున్న ప్రత్యూష ప్రేమ కథ, ఆమె ప్రేమించిన యువకుడి వివరాలు వెలుగులోకి వచ్చాయి.
తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకుంటానని, ఆమె అధికారులకు చెప్పగా, కేసీఆర్ నిర్ణయం తీసుకునేంత వరకూ ఈ విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోరాదని, కనీసం ప్రత్యూష ఆ యువకుడితో మాట్లాడకుండా చూడాలని సీఎంఓ అధికారులు ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి.
కాగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దత్తత పుత్రిక ప్రత్యూషను ప్రేమించిన యువకుడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. తాను ఓ యువకుడిని ప్రేమించానని, అతడ్నే పెళ్లాడతానని ఇటీవల ప్రత్యూష తెలిపిన విషయం తెలిసిందే.
ప్రత్యూష ప్రేమకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆమె ప్రేమించిన యువకుడి పేరు మద్దిలేటి వెంకట్ (బుజ్జి)గా గుర్తించారు కర్నూలు జిల్లా పోలీసులు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఈ యువకుడు తమ బంధువుల చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వచ్చాడు. అదే సమయంలో అక్కడే చికిత్స పొందుతున్న ప్రత్యూష పరిచయమైంది.
ఆపై మాటలు కలవడం, స్నేహం, ఫోన్ నంబర్ల మార్పిడి, వాట్సప్ చాటింగ్, ఫోటోలు షేరింగ్.. ఇలా సాగిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది.
కాగా, దీనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు ఆరాతీశారు. వెంకట మద్దిలేటి స్థానిక ఆటో మొబైల్ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ప్రత్యూష ప్రేమ, పెళ్లిపై ఆమెను దత్తత తీసుకున్న సీఎం కెసిఆర్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.