నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సోమవారం హైదరాబాద్ రానున్నారు. నేడు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. డిసెంబర్ 23న తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, ప్రతి శీతాకాలానికి భారత రాష్ట్రపతి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి(Rashtrapati Nilayam) విడిది చేయడానికి వస్తుంటారు.
ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్కు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం 6.25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి 7 గంటలకు ప్రవేశించి సేద తీరి, కొన్ని రోజులు ఇక్కడే ఉండనున్నారు.

బొల్లారం నిలయానికి వెళ్లే మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్కు సంబంధించి అధికారులు శనివారం రిహార్సల్ కూడా చేశారు. ఈ ఏర్పాట్లు మొత్తాన్ని సైబరాబాద్ సీపీ ఏకే మహంతి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయనున్నారు. సోమవారం సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అందుకు వాహనదారులు అందరూ ట్రాఫిక్ వారికి సహకరించాలని కోరారు. అందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు.
మరోవైపు, బొల్లారం రాష్ట్రపతి నిలయానికి శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడంతో అక్కడి నివాసంలో దాదాపు అన్ని పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షించి, పూర్తి చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 11 నుంచి 25 వరకు రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనను రద్దు చేశారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో బందోబస్తును కూడా భారీగా పెంచారు.












Click it and Unblock the Notifications