నిజామాబాద్ ఎన్నికల బరిలో ఉన్న రైతన్నల ఆందోళన .. ఎన్నికలు వాయిదా వెయ్యాల్సిందే
నిజామాబాద్ ఎన్నికల బరిలో ఉన్న రైతన్నలు ఎన్నికల అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు తమకు ఎన్నికల పట్ల ఏమాత్రం అవగాహన కలిగించలేదని, గుర్తులను కేటాయించలేదని, ప్రచారం ఎలా నిర్వహించాలంటూ ఆందోళన చేశారు. దీంతో నిజామాబాద్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.రైతుల ఆందోళన నేపధ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైతులను శాంతింపజేశారు.
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలు వాయిదా వేయాలని రైతులు డిమాండ్
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికను కనీసం 10 రోజులపాటు వాయిదా వేయాలని అక్కడినుంచి పోటీ చేస్తున్న రైతులు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు హైదరాబాద్లో రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలికి వినతిపత్రం సమర్పించారు. అభ్యర్థులకు కేటాయించిన గుర్తులకు సంబంధించి ఇంతవరకూ నమూనా చిత్రాలు ఇవ్వలేదని, దీంతో తాము క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతున్నామని తెలిపారు. బ్యాలెట్ పేపర్తోనే ఎన్నిక నిర్వహించాలని కోరిన రైతులు ఈవీఎంల తో ఎన్నికలపై తమకు అనుమానాలున్నాయని అన్నారు. స్థానిక ఎన్నికల అధికారి.. స్వతంత్ర అభ్యర్థులకు సహకరించడంలేదని, 185 మంది అభ్యర్థులకు కనీసం అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించలేదన్న రైతులకు ఎన్నికల అధికారులు అవగాహన కార్యక్రమానికి పిలిచారు .
గుర్తులు కేటాయించలేదని రైతుల ఆగ్రహం.. న్యాయ పోరాటం చేస్తామంటున్న రైతులు
ఇక ఈ నేపధ్యంలోనే నిజామాబాద్ లో పార్లమెంట్ బరిలో ఉన్న రైతు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈవీఎంల అవగాహనకు పిలిచి అర్ధాంతరంగా వాయిదా వేయడం తో.. ఆగ్రహం వ్యక్తం చేసిన బరిలో ఉన్న రైతు అభ్యర్థులు ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. తమకు గుర్తులు కేటాయించలేదని , ఎలా ప్రచారం నిర్వహించాలని ప్రశ్నించారు. నిజామాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సరైన సమాచారం ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, ఎన్నికల వాయిదా పై న్యాయ పోరాటం చేస్తామన్నారు. రైతుల ఆందోళన తో పోలీసులు అలెర్ట్ అయ్యారు. రైతుల తో మాట్లాడి ఆందోళన విరమింపచేశారు.