కేసీఆర్తో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ భేటీ: రాజకీయాలపై చర్చ, త్వరలో ఢిల్లీలో.!
హైదరాబాద్: పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ సింగ్ మాన్.. మంగళవారం ప్రగతిభవన్లో తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సమావేశమయ్యారు. పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన భగవంత్ మాన్.. కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతిభవన్కు వెళ్లారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాల ఇబ్బందులు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. భారత్ రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ఢిల్లీలో ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. నాటి నుంచి పలు రాష్ట్రాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు, రైతు సంఘాల నేతలు కేసీఆర్తో సమావేశమవుతున్నారు.

మరోవైపు, పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్సింగ్ సంధ్వాన్ డిసెంబర్ 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్కు రానున్నారు.

బీఆర్ఎస్ జాతీయ పార్టీగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో తమ రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు కసరత్తులు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో నేలతో చర్చలు కొనసాగిస్తోంది.

అంతేగాక, ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications