తెలంగాణాలో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఇదే; రాహుల్ పర్యటనపై రాజకీయవర్గాల్లో ఆసక్తి
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ పర్యటన కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో తాజాగా ఆయన పర్యటన రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెండు రోజులపాటు సాగనున్న రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ వివరాల్లోకి వెళితే
శుక్రవారం నాడు రాహుల్ గాంధీ ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత 5 గంటల 10 నిమిషాలకు ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు. 5 గంటల 45 నిమిషాలకు వరంగల్ గాబ్రియల్ స్కూల్ కు చేరుకుంటారు. 6 గంటల 5 నిమిషాలకు వరంగల్ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటుచేసిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. రైతు సంఘర్షణ సభ ద్వారా రాహుల్ గాంధీ అత్యంత కీలకమైన రైతుల సమస్యలను గురించి మాట్లాడనున్నారు. ఉద్యోగాల కల్పనలో జాప్యం, ధాన్యం కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి తదితర అంశాలను గురించి రాహుల్ గాంధీ సభలో మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఇక ఆ తర్వాత ఎనిమిది గంటలకు వరంగల్ నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 10 గంటల 40 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్ లోని హోటల్ తాజ్ కృష్ణ లో బస చేస్తారు. మరుసటిరోజు ఏడవ తేదీన మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తాజ్ కృష్ణ నుండి బయలుదేరి 12 గంటల 50 నిమిషాలకు సంజీవయ్య పార్కు చేరుకుంటారు. 12.50 నుంచి 1.10 నిమిషాల మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్యకు నివాళులర్పిస్తారు.
1.15 నిమిషాలకు అక్కడినుండి బయలుదేరి 1.30 నిమిషాలకు గాంధీభవన్ కు చేరుకుంటారు. 1.45 నుండి 2.45 వరకు అక్కడ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. ఇదే కార్యక్రమంలో పార్టీ మెంబర్షిప్ చేసిన కోఆర్డినేటర్ లతో రాహుల్ గాంధీ ఫోటోలు దిగుతారు. అనంతరం నాలుగు గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎయిర్పోర్టుకు వెళ్తారు. ఇక రాహుల్ గాంధీ తాజా పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ నేతలు రాహుల్ గాంధీ పర్యటన ను టార్గెట్ చేస్తూ సవాళ్ళు విసురుతున్నారు.