నేను బతికితే ఏంటీ? చస్తే ఏంటీ?: కేసీఆర్పై రాజా సింగ్ సంచలన ఆరోపణ
సీఎం కేసీఆర్పై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజా సింగ్ బతికితే ఏంటి? చస్తే ఏంటి? అనే భావనలో కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజా సింగ్ బతికితే ఏంటి? చస్తే ఏంటి? అనే భావనలో కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు. ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చారని విమర్శించారు.
పదే పదే మొరాయిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం వద్దని అధికారులకు గతంలోనే లేఖ రాశానని.. అయినా అదే వాహనాన్ని బాగు చేసి తిరిగి పంపించారని రాజా సింగ్ ఆరోపించారు.
పదే పదే రిపేర్కు వస్తున్నా అదే వాహనాన్ని బాగు చేయించి పంపుతున్నారే తప్ప కొత్త వెహికిల్ ఇవ్వడంలేదని విమర్శించారు రాజా సింగ్. కొన్నాళ్ల క్రితం వాహనం మొరాయించడంతో పురానాపూల్ చౌరస్తాలో దాన్ని వదలిపెట్టి వచ్చానని.. ఇప్పుడు అదే వాహనాన్ని రిపేర్ చేయించి మళ్లీ తన దగ్గరకు పంపారని రాజాసింగ్ వాపోయారు.
గతంలోనూ ఇలా చాలాసార్లు జరగిందని, ఎక్కడ ఆగిపోతుందో తెలియని ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ను మార్చాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని అన్నారు. ఖరాబైన వెహికిల్ను రిపేర్ చేసి ఎందుకు పంపుతున్నారని పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. సీఎం కేసీఆర్ తనకు అదే వాహనాన్ని కేటాయించాలని ఆదేశించిన విషయం చెప్పారని రాజా సింగ్ తెలిపారు. కొత్త వాహనం కేటాయించాలని ఎన్ని సార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.