హైదరాబాద్: నేటి నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శనకు అవకాశం, 15వ తేదీ వరకు
హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి మంగళవారం నుంచి సామాన్య ప్రజలను అనుమతించనున్నారు. ఈ నెల 15 వరకు ప్రజలు సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
రోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు సందర్శించేందుకు అవకాశముంటుంది. అయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రవేశ అనుమతిని నిలిపివేస్తారు.
రాష్ట్రపతి నిలయం చరిత్ర, ఉద్యాన వనాల వివరాలు, ఇప్పటి వరకు ఇక్కడ విడిది చేసిన రాష్ట్రపతుల వివరాలు, భవనాల నిర్మాణం, ప్రత్యేకతలు తదితర ఆసక్తికర అంశాలను వివరించేందుకు ప్రత్యేక గైడ్లను ఈ ఏడాది నియమించనున్నారు.
రాష్ట్రపతి నిలయం సందర్శనను తీపి గుర్తుగా మార్చుకోవడానికి సందర్శకులు కెమెరాలతో ఫోటోలు తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే వాహనాల ద్వారా నిలయంలోకి ప్రవేశం ఉంటుంది.
మిగతా వారు రాష్ట్రపతి నిలయం ఎదుట ఉన్న గ్రౌండులో తమ వాహనాలను నిలపాల్సి ఉంటుంది. క్యాంటీన్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతి ఇచ్చే సంప్రదాయనికి 2011లో నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శ్రీకారం చుట్టారు.