తెలంగాణ టీడీపీ చీఫ్ రేసులో రావుల చంద్రశేఖర్ రెడ్డి?: యువనేత పేర్లూ పరిశీలనలో
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ రాజీనామా చేసిన అనంతరం ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. దీనిపై ఇప్పటికే ఆయన టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొంతకాలంగా రాజకీయంగా క్రియారహితంగా ఉన్న పార్టీని మళ్లీ పూర్వవైభవానికి తీసుకుని రావడానికి రూపొందించాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక, సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు.
రజినీకాంత్ ఏది చేసిన సెన్సేషనే: రాజకీయాలకు శాశ్వతంగా గుడ్బై: ఏకంగా పార్టీ రద్దు
రావుల వైపు..
ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే విషయం వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న నేతల్లో సీనియర్ కావడం, తెలంగాణలో సమకాలీన రాజకీయాలపై పట్టు ఉండటం, టీఆర్ఎస్ సహా ఇతర పార్టీలను సమర్థవంతంగా ఢీ కొట్టగల సామర్థ్యం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు రావుల చంద్రశేఖర్ రెడ్డి వైపే మొగ్గు చూపారని అంటున్నారు.
యువనేతకు బాధ్యతలు అప్పగించాలనుకున్నా..
రాజకీయాలపై అనుభవం ఉండటంతో పాటు దూకుడుగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడినందున.. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ టీడీపీ సారథ్య బాధ్యతలను అందుకునే నాయకుడిని ఎంపిక చేయాల్సి ఉందని నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. యువ నాయకులకు పార్టీ పగ్గాలను అందించాలనే వాదన సైతం కొందరు నేతలు చంద్రబాబుకు వినిపించినట్లు సమాచారం. అధికార టీఆర్ఎస్ పార్టీకి మంత్రి కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరిస్తోండటం, కాంగ్రెస్కు దూకుడు నేతగా పేరున్న రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తోన్న విషయాన్ని వారు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
కేటీఆర్-రేవంత్-వైఎస్ షర్మిలకు ధీటుగా..
అదే సమయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రాజకీయాల్లో దూకుడుతో పాటు వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోన్న అంశం.. చర్చకు వచ్చినట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ క్రమంగా బలపడుతోన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని టీటీడీపీ నేతలు చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. కేటీఆర్, రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల వంటి యువనేతలు తమ పార్టీలకు దిశా నిర్దేశం చేస్తోన్న నేపథ్యంలో- అలాంటి నాయకుడిని టీడీపీకి నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయం చంద్రబాబుతో భేటీ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు.
Recommended Video
సీనియర్ వైపే
చంద్రబాబు మాత్రం సీనియర్ నేతకు పదవి ఇవ్వాలని భావిస్తోన్నారని, అదే జరిగితే- రావుల చంద్రశేఖర్ రెడ్డికే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఎల్ రమణ ఖాళీ చేసిన అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేయడానికి రావుల పేరు మీద జిల్లా స్థాయి నాయకుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోగా వారంతా సానుకులంగా స్పందించారని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ అంశంపై సమగ్రమైన పట్టు ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డికి అధ్యక్ష పదవిని ఇవ్వడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.