కేసీఆర్, కేటీఆర్, కవితలదే సంతోషం: కేసీఆర్ అన్న కూతురు రమ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు సోదరుడి(అన్న) కూతురు రేగులపాటి రమ్య స్పందించారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా తెలంగాణలో జిల్లాలను విభజిస్తున్నారని రమ్య ఆరోపించారు. ఎంపీ కవిత నోటికి వచ్చినట్టు మాట్లాడడం సరికాదని ఆమె హితవు పలికారు.
మాజీ మంత్రి డీకే అరుణ గడిలో కాదు.. గద్వాల ప్రజల గుండెల్లో ఉన్నారని ఆమె తెలిపారు. కవిత, కేటీఆర్ లు సిరిసిల్లకు గుదిబండల్లా తయారయ్యారని ఆమె విమర్శించారు.
కేసీఆర్, కేటీఆర్, కవిత తప్ప జిల్లాల విభజన పట్ల ఎవరూ సంతోషంగా లేరని ఆమె తెలిపారు. టిఆర్ఎస్ రావణాసుర పార్టీ అని ఆమె విమర్శించారు. జిల్లాల ఏర్పాటులో ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు.

డీకే అరుణ దీక్షకు మందకృష్ణ మద్దతు
డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య చేపట్టిన జిల్లాల అశాస్త్రీయ విభజన పోరాటానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మద్దతు ప్రకటించారు. వారిపై ఎంపీ కవిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన చెప్పారు.
స్వార్థ ప్రయోజనాల కోసమే జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జిల్లాల ఏర్పాటులో నిరంకుశత్వం కనిపిస్తోందని ఆయన విమర్శించారు. వరంగల్, హన్మకొండ విభజన ప్రజాభీష్టానికి వ్యతిరేకమని ఆయన చెప్పారు.
యాదాద్రికి ఉన్న అర్హత జోగులాంబకు వర్తించదా? అని ఆయన ప్రశ్నించారు. గోల్కొండ కోటకు ఇచ్చిన ప్రాధాన్యత గద్వాల కోటకు ఇవ్వరా? అని ఆయన ఆయన నిలదీశారు. అహంకారం తలకెక్కితే ప్రజలు తిప్పికొడతారని అన్నారు.












Click it and Unblock the Notifications