ఆక్సిజన్ కొరత, రెమిడెసివిర్ ఇంజక్షన్లకు కేంద్రానిదే బాధ్యత : మంత్రి ఈటెల రాజేందర్ అసహనం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సదుపాయాలు బాధితుల అవసరాలకు తగ్గట్టుగా అందడం లేదు. ఇక ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
కరోనా వ్యాక్సిన్ ధరల రగడ : జిఎస్టీ విధానంతో లింక్ , కేంద్రాన్ని లాజిక్ తో కొట్టిన మంత్రి కేటీఆర్ !!
4 లక్షల రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఆర్డర్ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామన్న కేంద్రం
ఈ రోజు మీడియాతో మాట్లాడిన అయన తెలంగాణ రాష్ట్రానికి 4 లక్షల రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఆర్డర్ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పటం సరికాదని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయంపై తాము నిరసన తెలియజేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ లాగే రెమిడెసివిర్ కూడా కేంద్రం తమ అధీనంలో ఉండేలా నిర్ణయం తీసుకోవడం బాధాకరమని పేర్కొన్న ఈటెల రాజేందర్ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఇంజెక్షన్లను తమకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణకు వ్యాక్సిన్ సరఫరా విషయంలో కూడా కేంద్ర వివక్ష
తెలంగాణకు వ్యాక్సిన్ సరఫరా విషయంలో కూడా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు . గుజరాత్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఎంత కేటాయించారో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు . దీనిపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తో మాట్లాడాను అని పేర్కొన్నఈటెల రాజేందర్ , హైదరాబాద్ లో ఒక్క తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు మాత్రమే కాకుండా, మహారాష్ట్ర , చత్తీస్ గడ్ , ఏపీ , కర్ణాటక రోగులు కూడా చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రోజుకు 384 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే ఇస్తుంది ఇదే
ఇక రాష్ట్రంలో రోజుకు 384 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని పేర్కొన్న ఈటెల రాజేందర్ , ప్రస్తుతం రాష్ట్రానికి రోజుకు 260 నుండి 270 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తోందని , ప్రస్తుతానికి అక్కడక్కడా ఇబ్బంది పడుతున్నప్పటికీ దాదాపు ప్రజల అవసరాలు తీర్చగలుగుతున్నామని పేర్కొన్నారు . రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అన్నారు. తమిళనాడు తరహాలో మా ఆక్సిజన్ మేమే వాడుకుంటామని చెప్పటం లేదని మంత్రి ఈటెల స్పష్టం చేశారు.
బ్లాక్ దందాపై మండిపడిన ఈటెల .. తెలంగాణలో జోరుగా బ్లాక్ మార్కెట్
తమిళనాడు తరహాలో తాము కూడా వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ఈటెల ప్రశ్నించారు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వారు డబ్బులు చెల్లించలేనివారిని గాంధీకి పంపుతున్నారని పేర్కొన్నారు ఈటెల రాజేందర్ . బ్లాక్ లో ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కానీ తెలంగాణా రాష్ట్రంలో ఆక్సిజన్ బ్లాక్ లో అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత నేపధ్యంలో రెమిడెసివిర్ ఇంజక్షన్లు కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు .