రూ. 25వేలకు రెమిడిసివిర్ అమ్మకం: నాచారంలో వ్యక్తి అరెస్ట్, 5 ఇంజెక్షన్ల స్వాధీనం
హైదరాబాద్: ప్రభుత్వం ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా కరోనా చికిత్సలో ఉపయోగించే రెమిడిసివిర్ ఇంజెక్షన్లను అక్రమార్కులు బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్నారు. తాజాగా, నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో రెమిడిసివిర్ ఇంజెక్షన్ బ్లాక్లో అమ్ముతున్న వినీత్(26) అనే వ్యక్తిని మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
బోడుప్పల్ కు చెందిన వినీత్ గత కొద్ది రోజులుగా రెమిడిసివిర్ ఇంజెక్షన్ను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాడని తెలిసింది. ఒక ఇంజెక్షన్ ను రూ. 27వేలకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, ఇంజెక్షన్ అసలు ధర రూ. 3490 కావడం గమనార్హం.
బ్లాక్ మార్కెట్ దందాపై సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు.. హబ్సిగూడలో వినీత్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద 5 రెమిడిసివిర్ ఇంజెక్షన్లను, రెండ్ సెల్ఫోన్లను, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నాచారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కరోనా బాధితులకు అండగా పోలీస్ శాఖ
కరోనా బాధితులకు తెలంగాణ పోలీసు శాఖ ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనుంది. ఇంట్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు ఉచితంగా మధ్యాహ్నం భోజనం అందించనుంది. సత్యసాయి సేవా సంస్థ, ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి, బిగ్ బాస్కెట్, హోప్ సంస్థలతో కలిసి 'సేవా భోజనం' పేరిట పథకాన్ని ప్రారంభించారు. భోజనం అవసరమైనవారు ఉదయం 7 గంటల్లోగా 7799616163 వాట్సాప్ నెంబర్ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు. హోం ఐసోలేషన్లో ఉన్న పిల్లలు, వృద్ధులకు ప్రాధాన్యత ఉంటుందని పోలీసులు చెప్పారు.