వుహాన్ను తలపిస్తోన్న ముషీరాబాద్ ఫిష్ మార్కెట్: మృగశిర ఎఫెక్ట్: చేపల కొనుగోలుదారులతో కిటకిట
హైదరాబాద్: ముషీరాబాద్ ఫిష్ మార్కెట్. జంటనగరాల్లో అందుబాటులో ఉన్న ఏకైక అతిపెద్ద చేపల మార్కెట్ ఇది. ఈ మార్కెట్లో లక్షలాది రూపాయల మేర వ్యాపార లావాదేవీలు నమోదవుతుంటాయి. ఒకవైపు రామ్నగర్, మరోవంక ముషీరాబాద్, ఇంకోపక్క గంగపుత్ర కాలనీ మధ్య ఉంటుంది. జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి చేపలను కొనుగోలు చేయడానికి వచ్చే వారితో క్రిక్కిరిసి పోతూంటుంది. ఆదివారం రోజు కొనుగోలుదారుల రద్దీ రెట్టింపు అవుతుంటుంది..సహజంగానే.

మృగశిర ప్రవేశించే సమయానికి..
అలాంటిది- మృగశిర కార్తె నాడు ఇంకెంత రద్దీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానున్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని వందలాది మంది కొనుగోలుదారులు ముషీరాబాద్ ఫిష్ మార్కెట్కు చేరుకున్నారు. ఆదివారం కావడంతో రద్దీ భారీగా కనిపించింది. కిటకిటలాడిపోయిందీ మార్కెట్. సాధారణ రోజుల్లో అయితే ఫర్వాలేదు గానీ.. కరోనా వైరస్ కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఫిష్ మార్కెట్ కొనుగోలుదారులతో నిండిపోవడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది.

కనీస జాగ్రత్తలు తీసుకోకుండా..
కరోనా వైరస్కు జన్మనిచ్చిన వుహాన్లోని హ్యూనన్ ఫిష్ మార్కెట్ను తలపించింది. ముషీరాబాద్ ఫిష్ మార్కెట్కు చేపలను విక్రయించడానికి లేదా కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలో ఏ ఒక్కరికైనా కరోనా వైరస్ సోకి ఉంటే.. అనే ఊహే భయాన్ని కలిగించేలా కనిపించింది అక్కడి పరిస్థితి. మార్కెట్కు వచ్చిన వారిలో చాలామంది కనీస జాగ్రత్తలను కూడా తీసుకోలేదు. కొందరు మాస్క్లను ధరించినా.. దాన్ని గడ్డం కిందికి చేర్చి..ఎదుటివారితో మాట్లాడుటం కనిపించింది.

ముందస్తు చర్యలు తీసుకోని జీహెచ్ఎంసీ..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే వందల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో రోజూ పదుల సంఖ్యలో కొత్త కరోనా కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వందలాదిమంది ఒకేసారి గుమికూడే ఫిష్ మార్కెట్లో కనీస జాగ్రత్తలను పాటించట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముషీరాబాద్ ఫిష్ మార్కెట్కు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు వస్తారనే కనీస ముందుచూపు జీహెచ్ఎంసీ అధికారులకు లేకుండా పోయిందని అంటున్నారు.

బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీ వాయిదా..
నిజానికి- ప్రతి సంవత్సరం కూడా బత్తిన సోదరులు మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటారు. అస్తమాను నయం చేసే శక్తి దానికి ఉందనేది నమ్మకం. అందుకే దేశం నలుమూలల నుంచీ చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి హైదరాబాద్కు వస్తుంటారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వంటి ప్రాంతాల్లో బత్తిన సోదరులు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించట్లేదంటూ బత్తిన సోదరులు ప్రకటించారు.

మృగశిర నాడే ఎందుకంటే..
అయినా చేపలను కొనుగోలు చేయడానికి జనం ఎగబడటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. మృగశిర కార్తె నాడు చేపలను తప్పనిసరిగా తినాలనేది ఆనవాయితీగా వస్తోంది. జ్యోతిష్యం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కోవిధంగా ప్రకృతిలో మార్పులు సంభవిస్తుంటాయి. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపవనాల రాక ఆరంభమౌతుంటుంది. ఫలితంగా వాతావారణం ఒక్కసారిగా చల్లగా మారుతుంది. ఆ సమయంలో సూక్ష్మక్రిములు, క్రిమి కీటకాలు పునరుత్పత్తి కూడా ఆరంభం అవుతుంది.
Recommended Video

వాతావరణ ప్రభావం వల్ల
వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. మృగశిర కార్తె ఆరంభం రోజు చేపలను తినడం వల్ల వాతావరణపరంగా సంక్రమించే వ్యాధులు రావని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే విషయం శాస్త్రీయబద్ధంగా కూడా నిరూపితమైంది. అందుకే ఆ రోజున చేపలను తినడానికి ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు. దాని ప్రభావమే ఇప్పుడు చేపల మార్కెట్పై పడింది. కరోనా పరిస్థితుల్లోనూ వందలాది మంది గుమికూడటానికి కారణమైంది.












Click it and Unblock the Notifications