కేసీఆర్తో భేటీలేనా! ప్రధాన సమస్యపై స్పందనేది?: గవర్నర్, కవితలపై రేవంత్ ఫైర్
హైదరాబాద్: హైకోర్టు విభజన విషయంలో గవర్నర్ నర్సింహన్ సరైన రీతిలో స్పందించడం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ క్రియాశీలకంగా వ్యవహరించి తక్షణమే హైకోర్టు విభజన సమస్య పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డితో కలసి బుధవారం ఆయన ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో వారానికి రెండుసార్లు సమావేశమవుతున్న గవర్నర్.. ప్రధాన సమస్య విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. టిఆర్ఎస్ నేతలపై అభిమానంతో వారికి ఆయుధాలిచ్చే రీతిలో మాట్లాడటం గవర్నర్ మానివేయాలని కోరారు.
హైకోర్టు విభజనపై తక్షణమే కేంద్రానికి నివేదికలు పంపాలని సూచించారు. హైకోర్టు విభజన పూర్తిగా కేంద్రానికి సంబంధించిన అంశమని దానితో ఏపీ సీఎం చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఏపీలో సౌకర్యాలు కల్పిస్తేనే అక్కడ హైకోర్టు ఏర్పడుతుందని, ఈ విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి తేలేమని కేంద్ర మంత్రి సదానందగౌడ చెప్పడంలో అర్థం లేదన్నారు.
ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు 2014లోనే కేంద్రానికి అధికారికంగా లేఖలు రాశారని వాటి ప్రతులను మీడియా ప్రతినిధులకు రేవంత్రెడ్డి అందజేశారు.
న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాదులు, న్యాయాధికారులకు తెలుగుదేశం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన చెప్పారు. చంద్రబాబుపై ఎంపీ కవిత వ్యాఖ్యలు వారి దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. విభజన చట్టంలో లోపాలున్నాయని రెండేళ్ల క్రితమే తెదేపా చెప్పిందని, వాటిని సవరించాలని మరో నేత రావుల చంద్రశేఖరరెడ్డి కోరారు.