కొడతారని తెలియదే, కెసిఆర్ కొట్టే దెబ్బలు తర్వాత చెప్తారా: రేవంత్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనను కొట్టారన్న మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యల పైన తెలంగాణ టిడిపి కార్యదర్శి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం శాసన సభలోనే కౌంటర్ ఇచ్చారు.
సీఎంలు కొట్టినా, తిట్టినా మంత్రులు పడి ఉంటారా అని ఎద్దేవా చేశారు. అంటే లోపలి రూముల్లోకి తీసుకెళ్లి ముఖ్యమంత్రి కొట్టినా మంత్రులు పడి ఉంటారనే విషయం తనకు ఇప్పటి దాకా తెలియదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కొట్టారన్న వ్యాఖ్యలు నిజమో, అబద్దమో తనకు తెలియదన్నారు.
అయితే, ఆ రోజు చంద్రబాబు కొట్టారని చెప్పిన పోచారం, రేపు ముఖ్యమంత్రి కెసిఆర్ కొట్టినవి చెబుతారని ఎద్దేవా చేశారు. అవి చెప్పాలని తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. లోపలి రూపంలోకి తీసుకెళ్లి మంత్రులను సీఎంలు కొడతారని ఇప్పుడు తెలిసిందన్నారు.
అయినా తాను ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లదల్చుకోలేదని చెప్పారు. అంతకుముందు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు తనను తొడపైన కొట్టారని చెప్పారు. ఆ తర్వాత గన్మెన్ ద్వారా తనను లోపలకు పిలిపించుకున్నారని, 'సారీ శ్రీనివాస్ రెడ్డి, ఏదో ఇరిటేషన్తో కొట్టా' అని చంద్రబాబు చెప్పారని పోచారం తెలిపారు. అయితే, నిజాం షుగర్స్ ప్రయివేటీకరణ ఆయన సీఎం కాబట్టి ఆయన అనుకున్నదే చేశారన్నారు.