నేను తగ్గేది లేదు: ఐటీ ఆఫీస్లో ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ, సమాధానాలపై సంతృప్తి
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విచారణ బుధవారం ముగిసింది. ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో ఆయనను అధికారులు దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు. అనంతరం ఈ నెల 23వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఐటీ అధికారులు ఆదేశించారు.
విచారణ అనంతరం రేవంత్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఐటీ శాఖను తమపైకి ఉసిగొల్పారని చెప్పారు. వారు ఎవరిని ఉసిగొల్పినా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. వివిధ సందర్భాలలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించారని చెప్పారు.
రేవంత్ ఎఫెక్ట్, బాబుకు చిక్కులు తప్పవా?: ఓటుకు నోటుపై కూపీలాగుతున్నారు, రూ.5 కోట్లు ఎక్కడ?
నా సమాధానాలతో సంతృప్తి చెందారు
తాను ఇచ్చిన సమాధానాలతో ఐటీ అధికారులు సంతృప్తి చెందారని రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకే తన విచారణ తొందరగా ముగిసిందని అన్నారు. ఎవరో అందించిన లేఖను ప్రముఖంగా ప్రస్తావించి తన పరువుకు భంగం కలిగించవద్దని ఆయన కోరారు. మోడీ, కేసీఆర్లు ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
భయానికి గురి చేయడం సరికాదు
పోలీసులు ఐటీ అధికారుల పేరిట తన బంధువుల ఇళ్లలో తనిఖీలు చేయడం దారుణం అన్నారు. ఉదయ్ సిన్హా స్నేహితుడు రణధీర్ రెడ్డిని భయభ్రాంతులకు గురి చేశారని, అది ఏమాత్రం సరైనది కాదని చెప్పారు. ఈ విషయాన్ని తాను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళానని చెప్పారు. ఈ నెల 23న మరోసారి విచారణకు హాజరు కావాలని అధికారులు చెప్పారన్నారు.
అక్రమ కేసులు పెట్టగలరేమో కానీ నిరూపించలేరు
ఆదాయపన్ను శాఖ అధికారులు, ఈడీ వంటి వాటిని ఉపయోగించడం ద్వారా ఎన్నికల్లో ఎవరూ గెలవలేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలపై ఇలాంటి వాటిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. తమ పైన అక్రమ కేసులు పెట్టగలిగినా వాటిని నిరూపించలేరని చెప్పారు.
రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో విచారణ
రేవంత్ రెడ్డిని అధికారులు దాదాపు నాలుగు గంటలు విచారించారు. నిన్న, మొన్న ఉదయ్ సిన్హా, కొండల్ రెడ్డి వంటి వారిని చాలాసేపు విచారించారు. రేవంత్ సమాధానాలు సంతృప్తికరంగా ఉండటంతో త్వరగా ముగిసినట్లుగా కనిపిస్తోంది. ఐటీ ఉప సంచాలకులు రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది.
రేవంత్ రెడ్డి విచారణ అదే కోణంలో
ఉదయ్ సిన్హా, రేవంత్ రెడ్డి మామ పద్మనాభ రెడ్డి, సెబాస్టియన్ తదితరులను అధికారులు ఓటుకు నోటు, ఈ కేసులో తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు, అలాగే మిగతా రూ.4.50 కోట్ల అంశంపై విచారించారు. రేవంత్ రెడ్డిని కూడా ఆ కోణంలో విచారించారని తెలుస్తోంది. ప్రధానంగా ఓటుకు నోటు కేసు పైనే విచారణ జరిగి ఉంటుందని అంటున్నారు.
వీటన్నింటి పైనా ప్రశ్నలు
గతవారం రేవంత్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులలోని లాకర్లు కూడా తెరిపించారు. పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత డాక్యుమెంట్లు, లభించిన ఆధారాల మేరకు ఆయనను ప్రశ్నావళి రూపొందించి, విచారించారని తెలుస్తోంది. రేవంత్ బావమరిది జయప్రకాశ్ రెడ్డికి చెందిన శ్రీ సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రయివేటు లిమిటెడ్లో రూ.20 కోట్ల లెక్క తేలని ఆదాయాన్ని గుర్తించిన అధికారులు దీని పైనా ఆరా తీసి ఉంటారని తెలుస్తోంది. సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన భూపాల్ ఇన్ ఫ్రా కంపెనీతో రేవంత్కు ఉన్న సంబంధాలపైనా వివరాలు సేకరించి ఉండవచ్చునని అంటున్నారు. అలాగే, జూబ్లీహిల్స్లో రేవంత్ ఇంటి అడ్రస్ పైన పలు కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని ఐటీ అధికారులు గుర్తించారు. వీటి గురించి కూడా ప్రశ్నించి ఉంటారని తెలుస్తోంది.